4, సెప్టెంబర్ 2011, ఆదివారం

ఐ లవ్ మై టీచర్స్....


పాపం మేగాలాన్ అయన సహచరులు సముద్రం లో ఓడ దారి తప్పి పోయి వారాలు గడచీ తిండి అయిపోయి ఆకలికి తాళలేక ఓడ లోని కలప ని రంపం తో కోసి ఆ పొట్టు తిన్నాడు. కధ విన్న వయసుకి నాకు మేగాలన్ స్పానిషా, పోర్చుగీసా తెలీదు అసలు ఆ దేశాలు ఉన్నాయని కూడా తెలీదు. ఉబుసు పోక సాయంత్రాలు మా అమ్మ హిస్టరీ పాఠాలు చెప్పేది...కొలంబస్, వస్కోడా గామా అంటూ.

వినటానికి నాకు బోలెడు కుతూహలం, అర్ధం కాని అమాయకత్వం, నాలుగేళ్ళ వయసు ఉన్నాయి.
కడుపు లోకి అన్నం పెడుతూ, ఇలాంటి విషయాలు బుర్ర లోకి పంపించేది..
" మేగాలాన్ ఎందుకు షిప్ లో తిరిగేడు ఏమి సాధించాడు అనే విషయం కన్నా...ఆకలికి తిండి లేక రంపపు పొట్టు తిన్నాడన్న విషయం జీర్ణం కాని విషయం. అందులో మనం కమ్మగా అమ్మ చేతి ముద్ద తింటూ.."

హిస్టరీ, దేశభక్తి కధలు సోషల్ టీచర్ అయిన మా అమ్మ చెప్తుంటే జాలి తో మనసు బరువేక్కేది.
నిజం నాలుగేళ్ళకి ఇలాటి ఫీల్ ఉంటుందా అని మీకనుమానం రాకపోతే మీరు మిగతాది చదవండి.
అలా నా మొదటి గురువు మా అమ్మ మాట వినపడే వయసు నుంచి, మాట్లాడే వయసు గుండా, మాట వినే వయసుదాక ఎన్నో మంచి విషయాలు నేర్పి, మాట వినని వయసులోకి పంపింది మా అమ్మ.

ఆక్కూరలు తింటే సర్కస్ వాళ్ళలాగా తయరవచ్చు. సర్కస్ లో చేరొచ్చు అంటూ తినే తిండి దగ్గర మొదలు పెట్టి జీవితానికి దూర పరుగులో (లాంగ్ రన్) అవసరమైన పాఠాలు నేర్పిన మా నాన్న నాకు అమర్స్త్య సేన్ లాంటి గురువు.



ఒకటో క్లాసు నుంచి నుంచి మొదలుపెట్టి నాకు చదువు చెప్పిన సరోజినీ టీచర్, సుశీల టీచర్, నాగరత్నం టీచర్, శాంతి టీచర్ నాకు అభిమాన గురువులైతే.

తెలుగు మీడియం లో చదివిన నాకు ఐదో క్లాస్ ఒక్క సంవత్సరం లోనే హై-స్కూల్ ఇంగ్లీష్ నేర్పిన మార్తమ్మ టీచర్ నాకు సదా స్మరణీయురాలు.
హిందీ నేర్పిన కుసుమా టీచర్ నా పాలికి మున్షీ.

ఆ తర్వాత హై స్కూల్ లో నేను పిల్లలను పిల్లలుగా చూసిన టీచర్లను చూడలేదు. కేవలం భుక్తి కోసం చదువు చెప్పే ఉద్యోగులను తప్ప.

వాళ్ళ వాళ్ళ కుటుంబ సమస్యలు, ఆర్ధిక పరిస్థితులూ ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు కానీ అవి వారు చెప్పే చదువు వాసి పైనా , చెప్పించుకునే విద్యార్ధుల పైనా ప్రభావం చూపకూడదు కదా అని నేను అనుకునే వాడిని. వాళ్ళలో వాళ్లకి కీచులాటలు, రాజకీయాలు, ప్రయివేట్ పోటీలు, పక్షపాత ధోరణులు ఇవన్నీ విమర్శిస్తే నేను విద్యార్ధి ని కాను. అవన్నీ నాకనవసరం స్కూల్ కెల్లామా, కూర్చున్నామా ఇంటికొచ్చామా అన్నట్టు ఉండేవాడిని. లోపల్లోపల రగిలి పోతూ.

డిగ్రీ కాలేజి రోజుల్లో క్లాస్ కి సరిగ్గా వెళ్లక పోయినాన దూరం నుంచే చూసి, ఆఖరి రోజు దగ్గరకి పిలిచి నీ తెలివి కి నువ్వు చదవాల్సిన విధానం ఇది కాదు అంటూ నెమలి ఈక తో కొట్టినట్లు చెప్పిన మిత్రాజీ గారు, శాస్త్రిగారు. నాకు ఇప్పటికీ గుర్తొచ్చే గురువులు.


లా కాలేజి లో నేను చదివినది రెండేళ్ళే అయినా చేరిన రోజే నా బాల్య స్నేహితుడు నన్ను చిన్నప్పటి పేరు తో బుజ్జి అని పిలవగానే క్లాస్ లో అమ్మాయిల తో సహా అందరూ నన్ను బుజ్జి పిలవటం తో మా సుధాకర్ సార్ కూడా బుజ్జి అనిపిలిచి, నేను సరిగ్గా వినటల్లేదని ప్రతీ పాయింటు నన్నే లేపి అడిగి, తద్వారా నేను క్లాస్ లో అలెర్ట్ గా ఉండేలా చేసి నన్ను స్నేహితునిగా చూసుకున్న మహానుభావుడు.

అసలు పది మంది కూడి ఉన్న చోట ఎలా చెప్తే అందరూ మన మాటే వింటారో అనే ముఖ్య లక్షణం నేను నేర్చుకున్నది ఆయన దగ్గరే.
అప్పుడప్పుడూ నాకో టాపిక్ ఇచ్చి నన్ను లైబ్రరీ లో ప్రిపేర్ అవమని నాతో నే క్లాసు చెప్పించి, తప్పులు దిద్ది నాకు సబ్జెక్ట్ ఒంట బట్టేలా చేసిన పుల్లా రెడ్డిగారు,

23 ఏళ్ళకి సెకండ్ ఇయర్ లా మానేసి ఉద్యోగం వచ్చిందని ఎగురుకుంటూ జేరిపోయిన నాకు, రెండు నెలల ఇన్ హౌస్ ట్రైనింగ్ లో క్రమశిక్షణ అంటే ఏంటో తెలియ చెప్పి, ఉద్యోగమంటే ట్రైనింగ్ హాస్టల్ కాదు, సరదా కాదు, గీతాంజలి పాటలు కాదు ( హాస్టల్ బాత్ రూముల్లో మేము గంటల కొద్దీ కచేరీలు చేస్తుంటే అయన వచ్చి తలుపు మీద దరువేసి బయటకి లాగే వారు) " రాబోయే ముప్పై ఏడు ఏళ్ళు నువ్వు ఎన్నో అధిగ మించి ఎన్నో ఎత్తుల కెదిగి సాధించాల్సి ఉన్నది ఎంతో ఉంది అది ఒక్క క్రమశిక్షణ తోనే సాధ్యం" అంటూ నూరి పోసిన మా ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ డి. సీతారామరాజు గారూ నాకు ప్రతి ప్రాతః స్మరణీయుడు. బాగా స్ట్రిక్ట్ గా ఆయన్ని అందరూ తిట్టుకున్నా నేను లోపల్లోపల లెంపలేసుకుంటూ ఉండేవాడిని గౌరవించే వాడిని.


ఇరవై రెండేళ్ళ ఉద్యోగ గమనం లో పై అధికారులనుంచీ, సహోద్యుగుల నుంచీ, నేను నేర్చున్నది

ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో,
ఏమి చేస్తే ఫలిస్తుందో
ఏమి చెయ్యక పోతే వికటిస్తుందో
అన్నీ ప్రత్యక్షం గా నేర్చుకున్నా.. అవన్నీ పరోక్షం గా నేర్పిన పెద్దలకు వేల దండాలు.

వీల్లేనా ? మిత్రులు , బంధువులు, అందరినుంచీ ఎంతో కొంత నేర్చుకున్న ..

అందుకే వారందరినీ నా ఉపాధ్యాయులుగా భావించి అందరికీ కోటి దండాలు.

ఇప్పటికీ...
సబ్ కుచ్ సీఖా హమ్ నే , నా సీఖే హోషియారీ.... సచ్ హై దునియా వాలోం కి హమ్ హై అనారీ.. ....అనిపిస్తుంటుంది.

3, సెప్టెంబర్ 2011, శనివారం

మర్జాలం = పిల్లి = మ్యావ్




ఐదో క్లాస్ పెద్ద పరీక్షలయాక ఎప్పటిలాగానే ఏప్రిల్ 25 న మా అమ్మ తో మేము ముగ్గురం పిల్లలం హైదరాబాద్ మా అమ్మమ్మ ఇంటికెళ్ళాం. రెండు నెలలు అక్కడే మేము ఇద్దరం అన్నదమ్ములం మధ్యలో ఒక ఆడపిల్ల , మా పెద్దమ్మ ఇద్దరు కొడుకులూ వెరసి నాలుగున్నర కోతులం. ఇల్లంతా లంక చేసి పెట్టేవాళ్ళం. అందుకని ఆ ఉధృతి తగ్గించటానికి మా అమ్మమ్మ ,మా పెద్దమ్మ, మా అమ్మ ముగ్గురూ శత విధాలా ప్రయత్నిస్తుండే వాళ్ళు.
పొద్దున్నే లెక్కలు చెప్పటం. సైన్సు బుక్స్ తెచ్చి అవి చదివి వివరించటం. ముఖ్యం గా ఫిజిక్స్ ఫర్ కిడ్స్ అనే బుక్స్ ఉండేవి అందులో పెద్ద పెద్ద భౌతిక శాస్త్ర సూత్రాలు చిన్న పిల్లలకు అర్ధం అయేందుకు ఇంట్లో అందుబాటు లో ఉండే పరికరాలతో ( గ్లాసు, గరాటు, కాగితం, నీళ్ళు, అట్టపెట్టెలు, రబ్బరు గొట్టం, ఇలా చాలా ) ప్రయోగాలు చేయించటం. ఏదోటి చేస్తూ మా అల్లరికి వరదకి భారీ ఆనకట్ట వేసే ప్రయత్నం చేసేవారు.

ఇంట్లో ఉన్న కధల పుస్తకాలు, కామిక్స్ అన్నీ చదవమని ఇచ్చేవాళ్ళు.పన్లో పనిగా వార పత్రికలు కూడా తీస్కోని అవన్నీ ఊదేసి నేను ఇంకా కావాలి అంటే మా పెద్దమ్మ ఒకరోజు మధ్యాన్నం మా ఇంటి రోడ్ చివర ఉన్న గగన్ మహల్ కాలనీ పార్క్ లో మేడ మీద ఉన్న లైబ్రరీ కి తీస్కెళ్ళి అక్కడ ఉన్న వందల పుస్తకాలు చూపించింది. నీ ఇష్టం ఇవ్వన్నీ నీకోసమే అని చెప్పింది. ఆ లైబ్రరీ లో అన్ని మాగజైనులు, నవలలూ, దొంతరల గా ఉన్నాయి. పొద్దున్న తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిది దాకా మన ఇష్టం ఆతర్వాత ఇంటికి కూడా తీస్కేల్లోచ్చు. మెకన్నాస్ గోల్డ్ సినిమా లో కొలరాడో పరిస్థితి. అన్ని పుస్తకాలు ఉన్నాయి ఏది మొదట చదవాలా అని చూస్తుంటే పెద్దమ్మ ఒక రాక్ దగ్గర కొన్ని పుస్తకాలు చూపింది. శాంపిల్ గా ఆమె ఒక బుక్ తీసి ఇచ్చి ఈ బుక్ చదువు నీలాంటి వాడి కధే అని చెప్పింది. నారింజ రంగు అట్ట దాని మీద ఒక పిల్లాడి బొమ్మ కింద మార్క్ ట్వైన్ "టాం సాయర్" నండూరి రామమోహనరావు అన్న పేరు కనపడ్డాయి.
అలా మార్క్ ట్వైన్ మీద మక్కువ పెంచుకోవటానికి ఆ వయసులో నండూరి వారు నా మెదడు దుక్కి దున్ని, నాట్లేసి, మరిన్ని అనువాదాలతో నీరు పోసి, స్వచ్చమైన తేట తెలుగు అనువాదాల సేంద్రీయ ఎరువులేసి, నా పఠనాభిలాషని ఏపుగా పెంచి నేను మరిన్ని అనువాద పుస్తకాలు చదివేలా చేసిన అయన పుణ్యాత్ముడు.

అసలు పేరుకే అవి మార్క్ ట్వైన్ కధలు కానీ వాటిల్లో తెలుగుదనమేంతో ఉంది. ఆ వయసులో అప్పటికి మార్క్ ట్వైన్ ఎవరో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి, అవన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయని తెలీదు. తెలిసినా ,పదేళ్ళ వయసులో తెలుగు మీడియం లో చదువుతున్న నాకు అవి గ్రేప్స్ నాట్ రీచబుల్ . ఇంగ్లీష్ పుస్తకాలు పుస్తకాలు చదవ లేను, కాబట్టి నండూరి వారి అనువాద సాహిత్యం" టాం సాయర్", విచిత్ర వ్యక్తి((మిస్టీరియస్ స్ట్రేంజర్) , హకల్బెరి ఫిన్, రాజు-పేద(డి ప్రిన్సు అండ్ డి పాపర్), రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ " ట్రెజర్ ఐలాండ్ " కాంచన ద్వీపం మొదలైన వన్నీ పిండి కొట్టేశాను.


నండూరి వారి గురించి నాకు పెద్దగా తెలియదు. చిన్నప్పుడు ఆయన అనువాద సాహిత్యం చదవటమే. ఒక దశాబ్దం క్రితం బుక్ ఎగ్జిబిషన్ లో ఆయన విశ్వదర్శనం రెండు పార్టులు , విశ్వరూపం కొని చదివినప్పుడు, చిన్నప్పటి బాల సాహిత్య రచయిత గా నా జ్ఞాపకం, ఇప్పటి విశ్వ దర్శనం చేయించిన ఈయన నిజరూపం ఏ మాత్రం పొంతన లేనివని గ్రహించా.
ఒక మంచి పాత్రికేయుడు, సంపాదకుడు.

నాకెందుకో ఇప్పటికీ ఇంగ్లీష్ లో చదివిన మార్క్ ట్వైన్ రచనల కన్నా నండూరి వారి అనువాదాలే బాగున్నాయని పిస్తుంది. ఎందుకంటే వీటిల్లో మన తెలుగుతనం, మన బాల్యం, చిక్కని తెలుగు తనం కనపడుతుంది.

ఇప్పటికీ నా మనసు నన్ను ఆరోక్లాస్ లోకి లాక్కేళ్ళమని మారాం చేస్తే నేను చేసే మొదటి పని
టాం సాయర్ బుక్ తీసి చదవటం. అదయ్యాక కాసేపు గోడలకు రంగేద్దామని, మా ఇంటి ఎదురు కొండ ఎక్కి దిగుదామని అని పిస్తూన్టుంది. అదేమీ జబ్బేమీ కాదు. నండూరి వారి అనువాద సాహిత్యం మహిమ. మనని మానసికం గా ఆరోగ్యం గా ఉంచే అరకు.

2006 లో పునఃప్రచురించిన ఆ పుస్తకాల ముందు మాటల్లో బాపురమణ గారలు సంయుక్తంగా చెప్పిన మాటల్లో కొన్ని పిప్పరమెంట్లు .....

"మార్జాలమంటే ఏంటి?"

" పిల్లి.. సార్ "
"ఇంకా సింపుల్ గా చెప్పాలి "
"మ్యావ్"
అనువాదానికి ఆయుపట్టయిన ఈ సులువు తెలిసిన పదిమంది లో తొమ్మండుగురు "నండూరి రామమోహనరావు గారే".
"ఈయన అనువాద మోహనుడే కాదు, వేద మోహనుడు, నాద మోహనుడు. భారతీయ పాశ్చాత్య వేద వేదాంతాలను మధించి వెన్న గాచిన నెయ్యిలా అందించారు."
ఈ అనువాద హనుమంతుడి ముందు ఇంకా కుప్పిగంతులేయము.
హాట్స్ ఆఫ్ !!
టోపీలు తొలగే
బాపురమణ
అంటూ ప్రేమగా అభిమానం గా ముందు మాట రాసేరు.

అంతటి మహనీయ పాత్రికేయుని, రచయితని, ఇంత కాలం బెజవాడ లో ఉండి చూడలేక పోయాను.

అందుకు సిగ్గు పడి ఈ మధ్యాన్నం వెళ్లి చూసి వచ్చా..
మౌనం గా ఆయన్ని కోరుకున్నా
లేవండి నేస్తం మరిన్ని రచనలు వార్చండి,
అనువాద మాయాజాలం పన్నండి,
లేవలేరా ? చేయి కదల్చలేరా?
విచిత్ర వ్యక్తి లోని సైతాన్ని పిలవనా
ఏదో మాయ చేసి మహిమ చూపి మిమ్మల్ని లేపమని ..?

నండూరి వారి ఆత్మ శాంతి కోసం

వారి కుటుంబ సభ్యలు మనఃశాంతి కోసం
భగవంతుని ప్రార్ధిస్తూ...

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఈయనెవరో చెప్పుకోండి ....


అందరూ ఫోటో పెట్టి ఈయనెవరో చెప్పండి చూద్దాం అంటున్నారుగా అలాగే నేనుకూడా
దమ్ము మీద దమ్ము వేస్తున్న ఈ పెద్దాయన ఎవరో చెప్పుకోండి ...

గణేషుని ఒకరోజు...


లొకేషన్ : హై ప్లేస్ గణేష్ లోకం
వినాయక అవెనూ
గణనాధ టవర్స్
పదహారో ఫ్లోర్ సుమారు కొన్ని లక్షల చదరపు అడుగుల వైశాల్యం ఉన్న బహుళ అంతస్తుల భవనం అది. అందులో పదహారో ఫ్లోర్ లో వేల చదరపు అడుగుల ఆఫీసు. నలువైపులా గాజు పలకలతో కట్టిన సోఫీస్టికెటెడ్ కార్యాలయం. హిందూ మతాచారం ప్రకారం విఘ్నాలని తొలగించి, ఆశీర్వదించే గణాధ్యక్షులవారి కార్యాలయం కాబట్టి, చాలా అధునాతనంగా ఉంది. దేవుడు ఒక్కడే కానీ కొలిచే వాళ్ళు వందల రకాలు కాబట్టి
ఆ ఫ్లోర్ అంతా క్యూబికల్స్ తో విభజింపబడి అన్నీ సీట్లలోను వినాయకుడే వివిధ రూపాలతో, వివిధ సంస్కృతులతో వివిధ ప్రాంతాల భక్తుల పూజలందుకొంటూ వాళ్ళ వాళ్ళ ఫైల్స్ చూస్తున్నాడు.

అన్నీ క్యూబికల్స్ మీద ప్రాంతాల పేర్లు రాసి వున్నాయి . కోస్తా వినాయకుడు, తెలంగాణా గణేష్, ఉత్తరఆంధ్రా విఘ్నేశ్వరుడు , సీమ గణపతి, ఏరియాల వారీ కాబిన్లు వాటిల్లో వివిధ వినాయక సాములు ఆసీనులై సీరియస్ గా ఫైళ్ళు చూసుకుంటున్నారు. కొంచం దూరం గా వేరే రాష్ట్రాల కాబిన్లు ఉన్నాయి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు.

మా టీవీ సున్నా ( టీవీ 0 ) విలేఖరి తెలుగు వాడు కాబట్టి ఫోకస్ తెలుగు కేబిన్ల పై మాత్రమే చేసాడు.
ఆ టైం లో సున్నా టీవీ విలేఖరి మొబైల్ మోగింది. ఫోనులో న్యూస్ రీడర్ కుతూహల, విలేఖరి గ్రాహక్ ని అడుగుతోంది " గ్రాహాక్ అక్కడ పరిస్థితేంటి ? "
విలేఖరి గ్రాహక్ " కుతూహలా ఇక్కడ పరిస్థితి చాలా సందడి గా ఉంది మన ప్రభుత్వ కార్యాలయాల్లోలా కాక ఇక్కడ అందరూ సీట్లలోనే ఉన్నారు ఎవరి పని వాళ్ళు చూస్తున్నారు" అన్నాడు.
"ఇంకా ఏమి జరుగుతోంది గ్రాహక్ ?" ఆత్రం గా కుతూహల.
"కుతూహలా జరిగేది, ఇంకా, ఇక్కడ, చెప్పాలంటే ,నిరంతరం వార్తలు, ఉన్నాయి " అంటూ ...కొన్ని పడికట్లేసి... కెమెరా ఆన్ చేసాడు.

తెలంగాణా గణేష్ పక్కన కేబిన్ల వైపు చూస్త "ఏంటి భాయ్ మీ ఆంధ్రోల్ల కి మా వాళ్ళని సూసి కాపీ కొట్టుడు ఎక్కువైంది పెద్ద పెద్ద విగ్రహాలూ, పెద్ద లడ్డూలు, భుజంనికి సెమ్కీ గుడ్డలూ, తలకి కాషాయ రిబ్బన్లూ అంతా మా వాళ్ళని కాపీ యే అన్నాడు టీసింగ్ గా.


కోస్తా ఆంధ్ర వినాయకుడు క్యూబికల్ పార్టిషన్ మీంచి చూస్తూ " ఏంటి గణేష్ మీ వాళ్ళు మాత్రం చేసేదంతా సొంత స్టైలా పాడా మహారాష్ట్ర వాళ్ళని ఉత్తరాది వాళ్ళనీ చూసి అనుకరిస్తున్నదే కదా" అన్నాడు రిటార్ట్ గా.

" పైగా మా ఆంధ్రా వాళ్ళ బిరియానీ పేడలా ఉంటుంది, వంటలు అదేదోగా ఉంటాయి, మీ పూజార్లు ముదుర్లు, మా వాళ్ళు లేతకువ్వలూ అనే మీ వాళ్లకు మా గోదావరి వంట వాళ్ళ లడ్డు తప్ప గతిలేదా? మీ దగ్గర అంత పెద్ద లడ్డు చేసే బావర్చీలు లేరా? " అన్నాడు వెటకారంగా.

తెలంగాణా గణేష్ కొంచం ఇబ్బందిగా చూస్తూ " గదేమ్లేదు ఏదో మీ వైపోల్లని పైకి తెద్దామని ..." అంటూ ఉండ్రాళ్ళు నమిలాడు.


ఉత్తరాంధ్రా విఘ్నేశ్వరుడు మిగతా అందరినీ చూస్తూ " ఈసారి రికార్డ్ లడ్డు మాదే 6000 కిలోలు, లడ్డూస్ బుక్ అఫ్ రికార్డ్స్ లోకి మేమే ఎక్కుతాం" అంటూ గీర పోయాడు.


తెలంగాణ గణెష్ "మా వాళ్ళు ఏదో ఉద్దెమం హడావిడి లో ఉంది ఈ సారి ఛాన్స్ మీకోదిలారు గానీ పెద్ద లడ్డూలు పెద్ద విగ్రహాలు ఏదైనా మమ్మల్ని కొట్టేవాల్లుందరు. అసలు ఈసారి మా వాళ్ళు విగ్రహాల విషయం లో కొంచం ఎక్కువ ఆలోచించే వాళ్ళు , బుద్ధ విగ్రహానికి పది రెట్లు విగ్రహం పెడదామని అనుకున్నారు కానీ మానుకున్నారు. అసలే హుస్సేన్ సాగరంతా ఆల్ రెడీగా విగ్రహాలున్నాయి కదా మల్ల ఇది కూడా సాలదని ఊరుకున్నారు. మీ పుల్లారావులు అడ్డం పడక పోతే త్వరలో మా సొంత రాష్ట్రం లోమా సొంత లడ్డూలతో, మా సొంత స్టైల్లో చాలా రికార్డులు నెల కొల్పుతాం. అప్పుడు మాట్లాడండి " అన్నాడు ఆశావహం గా.
పైగా
తెలంగాణా గణేష్ కోస్తా వినాయకుడుని చూస్తూ "ఇది చూడయ్యా మీ దగ్గర ఒక ప్రధాన నగరం లో ఇద్దరు నాయకులు పోటీలు పడి విగ్రహాలు పెట్టారు. లడ్డూలు కూడా పోటీలు పడ్డాయి . ఇలాంటి వీధి నాయకులు ఎంతమంది ఉంటే అన్ని విగ్రాహాలు నీకు,. ప్రజా సేవ లో లేని పోటీ తత్వం వినాయక సేవ లో ఉండటం గుడ్డిలో మెల్ల కదా." అన్నాడు.



సీమ గణపతి సీట్లోంచి కేచి రెండు చేతులూ పైకెత్తి వేళ్ళూ కలిపి వెనక్కి తిప్పి మెటికలు విరుచుకొని " అబ్బ ఆపండి మీ గోల అసలే మా వైపు ప్రజల కన్నా పాలకులే భక్తెక్కువై ఆ మైకం లో గుల్లల్లోకి చెప్పులు టక టక లాడించు కుంటూ వస్తుంటే మీరేంటి లడ్డూ సైజు, విగ్రహం సైజు అంటూ పాత విషయాలు మాట్లాడతారు ? " అన్నాడు నిరశన గా.
ఇంకా దారుణం ఏంటంటే ఆస్పత్రుళ్ళలో డాక్టర్లు వినాయక చవితి భక్తి లో మునిగి " పదిమంది పైగా పిల్ల మరణానికి కారణమయ్యారు " అంటూ దుష్ప్రచారం తప్పు కదా. అయినా వాళ్ళు మాత్రం మనుషులు కారా ... నన్ను పూజించుకోవద్దా? ఏమైనా జనానికి ఇవేమీ పట్టవు. రెండు రోజులు సెలవుమీద ఉంటే ఇంత గోల చేస్తున్నారు."

మిగతా ఏరియాల వినాయకుళ్లన్తా ఫైళ్ళు పక్కన పెట్టి సీమ గణపతి చుట్టూ చేరారు ఏమిటా చెప్పుల గోల మాకు చెప్పు అంటూ..

అప్పుడు సీమ గణపతి కొంచం పానకం తాగి గొంతు సవరించు కొని " ఆ ఏముందీ ఎప్పటిలాగానే మా ప్రాంత నాయకి ప్రభుత్వం తరుపున నాకు పట్టు బట్టలు పెట్టడానికి వస్తూ చెప్పులు విడవలేదని మా ప్రజలూ, గుళ్ళో పూజార్లు దుమ్మెత్తి పోశారు. అయినా ఆ రుణసుందరి కి ఇదేం కొత్త కాదుగా ఆమె వెనక పోనీటైలు వంకర కదా" అన్నాడు కసిగా.

ఇంతలో టీ బ్రేక్ బెల్ మోగింది... అందరూ కాంటీన్ కేసి నడిచి బల్ల చుట్టూ కూర్చొని ..ఇలా అనుకున్నారు.

"ఈ మనుషులకి ఎప్పటికి బుద్ది వస్తుందో ?
భక్తంటే భారా ఖర్చు కాదనీ
పూజంటే భారీ సైజు కాదని
శ్రద్ధ అంటే చెప్పులు మేక్అప్ లు కాదని
జీడి పప్పులతో,
వెయ్యిరూపాయల నోట్లతో,
టన్నుల కొద్దీ ఆపిల్ పళ్ళతో
కూరగాయలతో చేసే విగ్రాహాల ఖర్చు బదులు
భక్తి తో చేసే ఒక్క నమస్కారం దేవుళ్ళని చేరుతుందని"

అన్నార్తులకి పిడికెడు కూడు పెట్టని పూజ, బండెడు ప్రసాదం తో చేసినా అది దండగేననీ..!! తీర్మానించి,

ఇష్టం లేక పోయినా లంచం తీస్కోని పనిచేసే మామూలు ఉద్యోగుల్లా
వాళ్ళ ఫైళ్ళు చూడటానికి సీట్లలోకి వెళ్ళిపోయారు.

మన గ్రాహక్ కుతూహల ని దగ్గరనుంచి చూడాలనే కోరిక తో మళ్ళీ టీవీ సున్నా కార్యాలయానికి చేరాడు.


దేవతల పాత్రలను హాస్యానికి వాడుకునే సినిమా వాళ్ళనూ, రచయితలనూ అసహ్యించుకునే నేను
ఈరోజు నా బ్లాగ్ టపా కోసం వినాయకుడిని వాడుకున్నా, తప్పలా
నేను రాయటం మొదలెట్టాగా, నాకూ కోరికా , ఆశా, జేబూ, మెడా ఉన్నాయిగా..!!