15, నవంబర్ 2010, సోమవారం

ముడవని గొడుగు

కలిస్తే కలవని మనసులు
పిలిస్తే పలకని భావాలు
మడిస్తే ముడవని గొడుగుల్లాంటివి.
బయట వర్షం లో బానే ఉంటుంది
ఇంట్లో కొస్తే నే చీదర చిరాకు
ఎద్దు ఎండకు లాగితే ,దున్న నీడకి లాగినట్లు
కావిడి ని రెండు చేస్తే ఇంకా అరకెలా దున్నేదీ..
సేద్యమెందుకు చేసేది.
బుద్ది గడ్డి తిని వాళ్ళు దూక మంటే
దూకినాక కాళ్ళు విరిగాయాని ఏడ్చి ఏం ప్రయోజనం.
కాళ్ళే లేక ఎందాకా ఈ ప్రయాణం..??

13, నవంబర్ 2010, శనివారం

మా అమ్మ చాచా నెహ్రూ ని ఆపేసింది.


నవంబరు పద్నాలుగు మా ఇంట్లో ఒక ముఖ్యమైన రోజూ నెహ్రు పుట్టిన రోజని కాదు. మా అమ్మ పుట్టినరోజు.
ఆ రోజూ పుట్టిందనే మా అమ్మ పేరు ఇందిర అని పెట్టారు మా తాత అమ్మమ్మ.
చిన్నతనం లోనే వాళ్ల నాన్న చనిపోవటం తో మా అమ్మ పెద్దమ్మ ఇద్దరు పీ.యు.సి తోనే చదువా పేసి
టీచర్ ట్రైనింగ్ తీస్కోని పద్దెనిమిది ఏళ్ళ కే ఉద్యోగం లో చేరి పోయారు. అసలు వాళ్ళు ఏమి సాధించినా ఆ గొప్పతనమంతా మా అమ్మమ్మది.

చిన్న వయసులోనే భర్త పోతే ఇద్దరు హై స్కూల్ చదువుతున్న ఆడపిల్లలతో హైదరాబాద్ నగరం లో ఏ ఆధారమూ, ఉద్యోగమూ లేకుండా నెట్టుకొచ్చింది.

ఏం పెట్టిందో ,ఎలా పెంచిందో తెలీదు కానీ, ఒంటరిగా పిల్లలని పైకి తీస్కొచ్చి, పెళ్ళిళ్ళు చేసిన మా అమ్మమ్మ నా కంటికి ఒక కార్పోరేట్ కంపనీ CEO లా అనిపించేది. ఆమె ఐక్యూ ముందు మా ఇంట్లో అందరూ తక్కువే. ఆమె గురించి రాస్తే పెద్ద పుస్తకమే అవుతుంది.
పుట్టినరోజు మా అమ్మది కాబట్టి అమ్మ గురించే రాస్తా..

మా అమ్మ హైదరాబాద్ లో ఆమె బాల్యం గురించి అప్పుడప్పుడూ కధలు గా చెప్పేది అందులో ఒకటి
స్వాతంత్రానికి ముందు మా అమ్మ పదేళ్ళ లోపు నెహ్రు గారు హైదరాబాద్ రావటం,
రోజూ అయన బస నుంచి మీటింగ్స్ జరిగే స్తలానికి అయన కారులో వెళ్తుంటే
మా అమ్మ, పెద్దమ్మ, మిత్రులు ఆయన్ని చూడటానికి
ట్యాంక్ బండు మీద మాటు వేసి ఆయన్ని చూడలేక పోవటం
దాంతో కొంచం అల్లరి దైన మా పెద్దమ్మ నాయకత్వం లో పిల్ల లంతా చేతులు పట్టుకొని
రోడ్ కు అడ్డం గా నుంచున్నారు. కార్ ఆగి నెహ్రు గారు ఆ పిల్లలు ఎందుకు అడ్డం నుంచున్నారో
కనుక్కోమని పక్కనున్న వాళ్ళని పంపితే
మా అమ్మ వాళ్ళు నెహ్రు మాకు కనపడట్లేదు రోజూ అయన కోసం పొద్దున్నే ఇక్కడ ఎదురు చూస్తున్నాం
అని చెప్పారుట. మరుసటి రోజూ నుంచి నెహ్రు గారు ఓపెన్ టాప్ వాహనం లో నుంచొని
వాహన్నాన్ని చాలా నెమ్మది గా వెళ్ళమని చెప్పి అయన హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు
అలాగే వెళ్ళారుట. అంతే కాక వీళ్ళ తో కరచాలనం కూడా చేసారుట.

ఇంకా చిన్నప్పుడే సర్దార్ వల్లభాయి పటేల్ ని కూడ చూసింది.

ఇంకో ముఖ్య సంఘటన ఆంధ్రరాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారు
చనిపోయినప్పుడు అయన చితా భస్మం గోదావరి లో కలపటానికి మా అమ్మ
వాళ్ల మేనమామ ఆయినా జొన్నలగడ్డ రామలింగయ్య గారితో రాజమండ్రి వచ్చి స్వయం గా గోదావరి లో ప్రకాశం గారి చితా భస్మం కలిపి వెళ్ళింది.
ఇలాంటివి విన్నప్పుడు నాకు ఒళ్ళు పులకరించేది. మా అమ్మ చెప్పిన జాతీయ నాయకుల కధలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.
నా పసితనం లో మా అమ్మ పాడిన జోల పాటలు ఇప్పటికీ నాకు నిద్ర తెప్పిస్తాయి అంతగా గుర్తున్నాయి.
అందులో ముఖ్యం గా శ్రీకర కరుణాల వాలా వేణుగోపాలా (బొబ్బిలి యుద్ధం) బాగా పాడేది,
అదే పాట మా మేనల్లుడు పుట్టాక కూడా జోల గా పాడేది. భానుమతి గారికి మంచి అభిమాని. ఎపుడూ ఆమె పాటలే పాడేది.
మా అమ్మ స్కూల్లో టీచర్ గా చేస్తూ మా అమ్మని అక్క అక్క అని పిలిచే
సరోజినీ టీచర్ పెళ్లి చూపుల కోసం సావిరహే .. పాట నేర్పించి పాడించి సుబ్బారావు బాబాయ్ ని మెప్పించి
మరీ దగ్గరుండి పెళ్లి చేయించింది. తను పని చేసే స్కూల్లో అందరికీ ఎంతో అభిమాన సహోద్యోగి.
అలాగే విద్యార్ధినులకి వాళ్ల తల్లి దండ్రులకీ కూడా అభిమాన టీచర్.
క్రమశిక్షణ కి మరో పేరు గా తను పని చేసిన 38 ఏళ్ళ సర్వీసు లో
ఒక్కరోజు కూడ ఆలస్యం గా వెళ్ళేది కాదు. వాన రానీ పిడుగులు పడనీ 9 : 30 కల్లా స్కూల్లో ఉండేది.
సాయంత్రం స్కూల్ అయ్యాక అన్నీ మూయించి 5 :15 ఇంటికొచ్చేది.
అప్పటి పరిస్థితుల వల్ల PUC వరకే చదివి నందువల్ల మేము పెద్దయ్యాక బి.ఏ , బి.ఈడి చదివింది.
కాకతాళియం గా డిగ్రీ పరీక్షలు నేనూ మా అమ్మ ఒకే బెంచ్ మీద కూర్చొని రాసాం.
అక్కడ కూడా నన్ను తిట్టింది రాయకుండా దిక్కులు చూస్తుంటే.
బందర్లో ఒకే ఇంట్లో స్థిరం గా ఉండటం వల్ల మా రోడ్ కి ఇందిర టీచర్ గారింటి రోడ్ అనే పేరు కూడా వచ్చింది. అంత ఫేమస్.
ఇలా రాస్కుకుంటూ పోతే ఎంతైనా తనివి తీరదు.
ఎవరి అమ్మ అయినా అంతే.... కానీ మా అమ్మ కదా ఇంకాస్త ఎక్కువ అంతే.

ఈ నవంబరు పద్నాలుగు కి డెబ్బై నాలుగు లోకి అడుగు పెట్టిన మా అమ్మ మనవడుపెళ్లి, మనవరాలి పెళ్లి చూసి ముని మనుమల ఎత్తుకోవాలి , నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఆనందం గా జీవించాలని కోరుకుంటూ...







5, నవంబర్ 2010, శుక్రవారం

రోలు కి కట్టేసినందుకు....


దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటామో మన అందరికీ తెలుసు కదా మళ్ళీ చెప్పేదేముంది
కానీ ఈ రోజూ పొద్దున్నే పేపర్ చదువుతుంటే అందులోని ఒక శీర్షిక లో ఇంట్లో చనిపోయిన పెద్దల జ్ఞాపకార్ధం వాళ్ళకి స్వర్గ మార్గాన వెలుగు చూపటం కోసం దీపాలు పెడతారని... చదివా.
అయినా దైవ స్వరూపులైన స్వర్గస్తులకు మనం దీపం చూపట మేంటి అని నేను మా లేడీసు వితండ చర్చ చేస్కున్నాం.
ఆమాట కొస్తే దేవుడి ముందు చేసే దీపారాధన పెట్టే నైవేద్యం కూడ అంతేకదా..
దేవుడి కి లేకనా అయన అడిగారా మనల్ని
చీకట్లో ఉన్నాను బాబోయ్ కాస్త దీపం చూపించండి,
ఆకలేస్తుంది అమ్మాల్లారా ఏదన్నా పెట్టండి అని .....
మనమే దేవుని మీద నమ్మకం మీద,
అయన ఉన్నాడని ఆయనే మనకి అన్నీ సమకూరుస్తున్నాడని ,
అందుకే దేవునికి ఆ కృతజ్ఞాత చూపటానికి దీపం నైవేద్యం పెడుతున్నాం.
అంచేత పెద్దల కోసం ఇంటి ముందు దీపాలు వెలిగించుదాం,
గతించిన మన పెద్దల జ్ఞాపకార్ధం కోసమే కాదు
మన రక్షణ కోసం ప్రాణలోడ్డిన మన అమర సైనికుల కోసం కూడా
చెడు మీద మంచి గెలుపుకు చిహ్నం గా
చెడ్డ నరకాసురుడి మరణం గుర్తుగా
శత్రు దేశాల మీద మన సైన్యం విజయం జ్ఞాపకం గా
మన గుమ్మం ముందు దీపాలు ఉంచుదాం.
మా తాతయ్యలు అమ్మమ్మ నాయనమ్మ మా నాన్న, పెదన్నాన్న ,
ఇంకా మమ్మల్ని కన్న పిల్లల్లా చూస్కున్న మా చిన్నప్పటి ఇంటి ఓనర్ తాతయ్య అమ్మమ్మ బాబాయ్,
నాకు చదువు చెప్పి గతించిన కొందరు టీచర్లు,
నా ఉద్యోగమ్ లో ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు
ఇంకా విధి వశాత్తు మరణించిన ఒకళ్ళిద్దరు స్నేహితులు
అందరి ఆత్మ శాంతి కోసం మా ఇంటి ముందు నేను కూడ దీపాలు ఉంచుతా
లోక సమస్తా సుఖినో భవంతు.
విరకొట్టే వార్త ( బ్రేకింగ్ న్యూస్) ఇది రాస్తున్న ప్పుడే మా అమ్మాయి మేసేజ్ పంపింది
రావణుని చంపి అయోధ్యలో మొదటిసారి అడుగు పెట్టిన శ్రీ రాముని విజయం,
నరకాసురుడుని చంపిన శ్రీ కృష్ణుని జయం,
ఇంకా రోజే అమ్మ యశోద అల్లరి కృష్ణుని రోలు కి కట్టేసిందట
( ఎంత ముద్దుగా ఉందొ ఆలోచన మా అమ్ముగాడిలా ) అందుకే దీపావళి .
అందుకే అనందం లో దీపావళి చేస్కుందాం.




3, నవంబర్ 2010, బుధవారం

లక్ష్మి దేవి మీ గుమ్మం లో...


సారి నిజమైన ఆనందకరమైన మరియూ సురక్షిత మైన దీపావళి
జరగాలి.

మధ్య కాలం లో దీపావళి సందర్భంగా టీవీ లలో పేపర్లలో వచ్చే ప్రకటనలు ఇంకా సెలెబ్రిటి లు నాయకుల ఇచ్చే
సందేశాలలో " ఆనందకరమైన మరియు సురక్షిత మైన దీపావళి మీకు మరియూ మీ కుటుంబానికి.." అంటూ చెప్తున్నారు కదా
అందులో
భాగం గా ఎన్నో జాగ్రతలు ఉంటాయి.
పిల్లలను ఒంటరిగా టపాసులు కాల్చనివ్వద్దు అని.
బట్టలు నూలు వి వాడండి పట్టు మరియు టెర్లిన్ దుస్తులు వేస్కో కండి ..
దగ్గరలో నీటి బకెట్, ఇసక నింపిన బకెట్ ఉంచుకొండి..
ప్రధమ చికిస్థ సామాను రెడీ గా ఉంచుకోండి అని.
గట్టిగా
శబ్దం వచ్చేవి కాల్చకండి అని బోలెడు జాగర్తలు చెప్తారు కదా

మరి నువ్వేమన్నా అమలవా ? లేక జెనీలియా వా నువ్వేమి సందేశాలు చెప్తావోయ్ అని అనుకుంటున్నారు కదా
అవును మీకు తెలిసినవే ఆయినా మీకు సంభందం లేక పోయినా సరే
కొన్ని
ఉన్నాయి అవి మళ్ళీ తిరగేస్కుందాం

ప్రతీ పండగ లాగా నే దీపావలికీ కొత్త బట్టలు మిఠాయిలు కొనుక్కోవటం మామూలే
కాక పోతే దీపావళి కనుక టపాకాయలు కూడా కొనుకోవచ్చు
అందుకే దీపావళి కి నా సందేశం బలవంతంగా మీకు వినిపిస్తా
అన్ని
పండగలలో వృధా ఎక్కువయ్యే పండగ దీపావళి
కారణం టపాసులే చాలా వేల డబ్బు ఇచ్చి కొన్ని నిముషాల లో తగల బెట్టే టపాసులు
దానికి మనం వెచ్చించే ధనం...
ఏంటో ఆత్రేయ ఎప్పుడూ పిసినారి మాటలు రాస్తాడు అనుకో కండి
బాగా చిన్నప్పుడు నాకూ ఇష్టమే అలా తగలేయటం
మా నాన్న ఎన్ని కొన్నా ఇంక కొనచ్చుగా అనుకునే వాడిని బహుశా డబ్బు విలువ అప్పుడు అంత తెలియక పోవటం
వల్ల
క్రమేపీ కోరిక తగ్గిపోయింది
నేను టెన్త్ లోకి వచ్చేసరికే నాకు టపాసుల మీద ఆసక్తి పూర్తిగా పోయింది
అప్పటికి నాకు కొంత అవగాహన రావటం వల్ల కావచ్చు లేదా వేరే ఏదైనా కారణం కావచ్చు
నాకు బాగా గుర్తు " చిన్నపిల్లలు మిణుగురు పురుగులు చూసి పడే ఆనందం ఆశ్చర్యం ముందు
పెద్దాళ్ళు వేలు పెట్టి కొని కాల్చే బాణసంచ వెలుగులు ఏ మాత్రం ?"

వాక్యము నేను ఇలాగే చదివి ఉండక పోవచ్చు వాక్య నిర్మాణం వేరే రకం గా ఉండి ఉండవచ్చు కానీ భావం మాత్రం
నా మనసులో బలం గా నాటుకు పోయింది.
అప్పటి నుంచి నేను బాణా సంచా వదిలి మిణుగురు పురుగుల కోసమై ఆశగా వెతకటం మొదలు పెట్టా...
ఫలితం నేను ఎన్నో వెలుగులు చూసా మనసులో నింపుకున్నా అజ్ఞాతంగా నైనా ..
పండగ ముందు సుత్తి ఏంటి అనుకోకండి ..
మన ఇంటి ముందు ఎన్నో పదుల, వందల దీపాలు వెలిగించే ముందు చుట్టుపక్కల ఎక్కడన్నా చీకటి పేరుకు
పోయిందేమో వెతుకుదాం...
చీకటి లో ఒక్కటన్నా చిరు దీపం ఉంచి అప్పుడు మన గుమ్మం, ఇల్లు కాంతి మయం చేస్కుందాం.....
అప్పుడే శ్రీ మహా లక్ష్మి మరింత సంతోషిస్తుంది .. మన జీవితం కాంతి మయం చేస్తుంది.
ప్రాక్టికల్ గా చెప్పుకుంటే .... మన దీపావళి ఖర్చు లో ఒక పాతిక శాతం తగ్గించి ఏదైనా బీద కుటుంబానికి సాయం చేస్తే( దీపావళి చేస్కోవటానికి కాదు బతక టానికి ) అది విద్య కోసం కావచ్చు వైద్యం కోసం కావచ్చు లేక అసలు తినటానికే
కావచ్చు.
తృప్తి ముందు ఆనంద కాంతి లో మరే మతాబాల అవసరం ఉండదు.
మరే టపాసుల ఢమ ఢమ లు వినిపించనంత శ్రావ్యం గా ఆనంద రవం ఉంటుంది.

దీపావళి రోజూ మీ గుమ్మం లోకి నిజం గా లక్ష్మి దేవి రావాలని మనసారా కోరుకుంటూ....














1, నవంబర్ 2010, సోమవారం

నాకూ మా అన్నకూ పోరు....




నేను పెద్దమనిషి అయ్యా నువ్వెప్పుడురా..?? అంటున్నాడు మా అన్న నన్ను ఈమధ్య ...

మా అన్న నేను ఇద్దరం మంచి వాళ్ళం.
స్వర్ణ హరిత మయమయిన మా ఇంట్లో
మేము ఇద్దరం చాలా కాలం గా బానే ఉన్నాం.
మా అమ్మ నాన్న ఇద్దరినీ సమానంగానే పెంచినా...
వాడిని కొంచం ఎక్కువ సమానం గా చూసేరు.
అలాగే ఇద్దరం సమానంగా మంచి వాళ్ళమే
కానీ నేను కొంచం ఎక్కువ మంచాడినన్న మాట.

కావాలంటే వాడిని అడగండి ఇదే చెప్తాడు
నన్ను కొంచం ఎక్కువ సమానంగా చూసినట్లు
అలాగే వాడు కొంచం ఎక్కువ మంచాడయినట్లు.

ఇలా సమానంగా ఆలోచించు కుంటూ ఇద్దరం పెరిగాం
మా ఇంటి వనరులన్నీ సమానంగా పంచుకుంటూ..
కాక పోతే ముందే చెప్పాగా వాడు మా వనరులని
కొంచం ఎక్కువ సమానంగా వాడుకున్నాడు.
నాకని పిస్తుంది పెద్దవాడు,
మనకన్నా వయసు లో మా పెద్దాల్లకి దగ్గరవాడు అవటం వల్ల
వాడి మీద మా వాళ్ళు కొంచం ఖర్చు ఎక్కువే పెట్టారు,
ముద్దు ముచ్చట్లకీ చదువు కీ షోకులకీ.
చిన్న వాడవటం వల్ల నేను ఏదీ కావాలని అడిగే వాడిని కాను
కానీ అన్నీ నాకూ సమకూరేవి.
కానీ ఏమైందో తెలీదు ఈ మధ్య మా అన్న నా మీద పగ పట్టాడు.
చిన్నపట్నుంచి నాకూ ఏదీ ప్రతేకంగా కావాలని అడిగే అలవాటు లేదు
దొరికిన దాంతో సరిపెట్టుకోవటం అలవాటై పోయింది ,
అయినా నాకూ ఎక్కువే దొరికేది అనుకోండి.

అలిగిన మా అన్న ఊరుకోకుండా ఆస్తి పంచేస్కుందాం అన్నాడు
తన వాటా కింద మేము బోర్ వేసిన పడమటి వాటా భూమి
అలాగే మేము నడిపే ఖార్ఖానా ఉన్న రేకుల షెడ్డు
ఇంకా డబ్బు దస్కం లో ఎక్కువ శాతం తనకే కావాలని పేచీ మొదలెట్టాడు.

ఆ బోర్ వేసిన ఎకరాలు పోతే నా వాటా కి మిగిలేవి నీటి వసతి లేని ఎండు భూమే
నా దగ్గరున్న డబ్బులన్నీ పెట్టుబడి పెట్టిన ఖార్ఖానా ఉన్న షెడ్ పోతే
నాకూ ఇక మిగిలేది ఖాళీ ఇల్లు ...ఖాళీ సమయం ....
అందుకే నేనూ కలిసే ఉందామని మా పెద్దాళ్ళ తో కబురేట్టా....
మా అన్న ఉహు ససేమీరా అన్నాడు.
నేను మాత్రం తక్కువ?? వాడు అడిగిన దానికి ఏ మాత్రం కుదరదని చెప్పేసా..
ఏ మాటకామాటే చెప్పుకోవాలి
బోర్ పడమటి భూమిలో ఉన్నా నీరు పారేది నాకొచ్చిన తూర్పు వాటాలోకే ..
ఖార్ఖానా లో పని చేసేది మా అన్నే అయినా లాభాల మూట నాకే వస్తుంది, పెట్టుబడే నాది.
అందుకని ఇప్పుడున్న స్థితినే ఉండనిద్దామని నచ్చచెప్పే ప్రయత్నం చేశా..
అయినా వాడు వినటం లే.....
రోజూ తాగి వచ్చి గోల చెయ్యటం మొదలెట్టాడు.
దీనివల్ల మా ఇంటి పరువు రోడ్ కెక్కింది ,
ఈ పరిణామం చుట్టూ పక్క వాళ్లకి వినోదాన్ని ,
చెట్టుకింద లాయరు గారికిమంచి ఆదాయ వనరు లా,
పేపర్ మిత్రులకీ , టీవీ చుట్టాలకీ మంచి కాలక్షేపంలా తయారయ్యింది....
మేమిద్దరం ఇలా కొట్టు కోవటం మా అమ్మ భూదేవి కి భార మైన అవమానం గా ఉంది
పోయిన మా నాన్న ఏదో ఈ మాత్రమైనా అమర్చగలిగా ..
ఇది కూడా లేక పోతే దేనికోసం కొట్టుకునే వాళ్లురా
అన్నట్టు దీనం గా చూస్తున్నారు ఫోటో లోంచి
అయినా మా పంతం మాదే

మా పిల్లలు చదువు మానేసి
మా నాన్న కరేక్టంటే మా నాన్నే కరక్టంటూ వాదించు కుంటున్నారు

అసలు వేరే వేరే ఇళ్ళ నుంచి వచ్చిన మా ఆవిడా, మా వదిన
ఈ గోల లో బాగా దగ్గరయి ఈ అవమానం భరించలేక అప్పుడప్పుడూ కిరోసిన్ తో బెదిరిస్తున్నారు.
అయినా మాకు మాత్రం బుద్ది రావట్లేదు.
మేమిద్దరం ఇలా కొట్టుకుంటుంటే చిన్నప్పుడే అరవ దేశం లో ఉన్న
మా పెదనాన్నకి దత్తత వెళ్ళిన మా అక్క

ఇంట్లో నగలూ నట్రా అన్నీ ఊడ్చుకెల్లింది.
ఆమె ని ఎవరూ ఆపలేక పోయాం కారణం మా గొడవల్లో మేముండటమే.
ఇంకా దారుణం మా ఖార్ఖానా లో పని చేసే
పని వాళ్ళు వేరే చోట చేరి పోతున్నారు

ఇక్కడ ఉంటె పని ఉంటుందో లేదో అన్న భయం తో ....
ఇలాంటి గొడవల మధ్య మా అమ్మ 54 వ పుట్టిన రోజు వచ్చింది
ఏమి చేస్కుంటాం ? మేమిరువురం మా గోల లో ఉండి మా అమ్మ ను పట్టించుకోలేదు మామూలుగా అయితే పూర్ణాలు పులిహోర తినే వాళ్ళం..
కానీ మా అమ్మ మనసు బాలేక
ఇద్దరిలో ఎవరికీ సర్ది చెప్పలేక,
ఎవరిని సమర్దిస్తే ఇంకెవరు భాధ పడతారో అన్న భయం తో..
దగ్గుతూ, ఆయాసపడుతూ ఒంటరిగా తనే గుడి కెళ్ళి దండం పెట్టుకోచ్చింది
:

" దేవుడా త్వరగా సమస్యకి ఏదో పరిష్కారం చూపు స్వామి అని

నా ఇల్లు ని తిరిగి స్వర్ణ హరిత మయం చేయి స్వామి అని
నా పిల్లలు మధ్య సమతా సామరస్యం ప్రతిష్టించు దేవా అని
ప్రతి కుటుంబ క్షేమం సమాజ క్షేమం కనుక ఇంకెక్కడా ఇలా జరక్కుండా చూడు తండ్రీ అని.."

కుదిరితే
మీరు ప్రార్ధించండి మా ఇద్దరికీ బుద్ది రావాలని..!!