22, జులై 2011, శుక్రవారం

తగుల బెట్టేస్తే ..?


"హలో "
"హలో చెప్పండి "
"హలో హల్లో ఎవరూ ..?"
"హల్....నే ... తోందా?"
" ఎవరు ..?"
" నేనే ...హన రావ్ ని
" హలో సరిగ్గా వినపడట్లేదు .."
" హ..లో నే...అస..న రావు నండీ "
ఒక్క క్షణం అనుమానం ఆసన రావా ? అనాస రావా? ఆయాస రావా?
మళ్ళీ "హలో ఎవరూ..?"
"నే.. .. సహన రా.."
"సహన రా?"
".. న పడు... oదా?"
సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా.
"మళ్ళీ కాల్ చేస్తా ఈ నంబరు కే చెయ్యనా?"
"నే అసహన రావ్ ని ...తోందా?"
"లేదు "
"ధూ దీ న... ఫోనూ ధాల్ కనక్ ఛి డం "
చూస్తే కాల్ దిస్కనేక్టేడ్
ఈ సారి నేనే చేశా "కు.. కు.. కు.. మీరు డయలు చేసిన వాడి ఫోన్ స్విచాఫ్ చేయబడి ఉంది దయచేసి మళ్ళీ ప్రయత్నించండి"
గంట తర్వాత ఆఫీసు లో నా ముందు ఒకాయన ఉన్నాడు.
నమస్తే సార్ నా పేరు అసహన రావ్ (ఎక్కడో విన్నట్టు ఉందే..)
నేనే సార్ ఇందాక ఫోన్ చేశా సరిగ్గా వినపడలేదు.
అవును ఏదో పెద్ద శబ్దం తోకట్ అయింది మళ్ళీ నేనే కాల్ బాక్ చేశా స్విచాఫ్ అని వచ్చింది.
అవును సార్ కోపమొచ్చి నేల కేసి కొట్టా పగిలిపోయింది. మళ్ళీ చేద్దామంటే ఫోన్ లేదు మీ నంబరు కూడా లేదు.

ఆగు ఆగక్కడ సిగ్నల్ సరిగ్గా లేక పోతే ఫోన్ నేల కేసి కొడతావా...

అతనొచ్చిన పని ఒదిలేసి నా ఆలోచన లో నేను ... " ఏంటీ ఈ అసహనం? చిన్న విషయాలకే ఇంత రియాక్షనా?"
ఫోన్ సిగ్నల్ లేక పోతే మళ్ళీ కాల్ చేసి ప్రయత్నించాలి. అంతే గానీ ఫోన్ నేల కేసి కొడితే జరిగేది ఏంటి అసలు కే మోసం
అందుకే ఈయన పెద్దలు అసహన రావ్ అని పేరుపెట్టారు.

టీవీ లో స్క్రోల్ ...

జూనియర్ఇంటర్ చదివే పిల్ల కార్పరేట్ కాలేజీ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య
వత్తిడి తట్టు కోలేక అమ్మ నాన్నలని నిరాశ పరచలేక
నేను ప్రాణం ఒదిలేస్తున్నా నన్న లేఖ

ఇంకో ఛానల్ లో ఎక్స్ క్లూసివ్ మాదే...

ప్రేమికురాలి నిరాకరణ తో
ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య

పేపర్ లో....
ఆర్ధిక ఇబ్బందులూ అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్య
హాస్పిటల్ లో రక్షింపబడి పదేళ్ళ బాలుడు అనాధగా మిగిలాడు

బ్రేకింగ్ న్యూస్
మా రాష్ట్రం మాకు ఇవ్వలేదని ఉరేసుకున్న పాతికేళ్ళ యువకుడు.

వీళ్ళందరికీ తల్లిదండ్రులూ,చదువు, సమాజం, వెనక నుండి నెట్టే నాయకులూ ఏమీ నేర్పరా ?

జీవితమన్నది ఒక్కటే నని,
చదువు, ప్రేమ, కుటుంబ బాధలూ, సొంత రాష్ట్రాలూ
ఇవన్నీ వివిధ మజిలీలనీ
అవి చేరక పోతే పోయేది ఏమీ పెద్దగా ఉండదనీ,

మళ్ళీ ప్రయత్నం చేయటం ద్వారా అవి సిద్దించ వచ్చని
అమాయకంగా ప్రాణాలు తీసుకుంటే మళ్ళీ తిరిగి రావనీ

ఇవన్నీ లేకుండా కూడా జీవితం ఉంటుందనీ
చచ్చి సాధించటానికి యిది అమర జీవుల శకం కాదనీ.

ఇంట్లో పిల్లలనుంచీ మొదలిడి బయట బంధు మిత్రుల దాకా
ఎవరైనా మానసిక ఒత్తిడికి గురైతే
డిప్రెషన్ లో ఉన్నట్లు కనపడితే
చేర దీయండి, నాలుగు మంచి మాటలు చెప్పి
ఏమార్చండి . అంతే కానీ పోయాక
సంతాప సభలు, ఓదార్పు యాత్రలూ, శవరాజకీయాలూ
ఎవడినో బాగు చేస్తాయి కానీ జీవితాన్ని తిరిగి ఇవ్వవు.

సెల్ అయితే మళ్ళీ కొనుక్కోవచ్చు, పరీక్ష పోతే మళ్ళీ వ్రాసి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు,
ప్రేమ ఇంకోళ్ళనుంచి పొందొచ్చు, రాష్ట్రం బతికుండి సాధించు కోవచ్చు.

కానీ జీవితం ఒక్కటే అది మళ్ళీ రాదు,
పనికి మాలిన విషయాలకు, ఆశయాలకు దాన్ని బలి చేస్కోవద్దు.

చిన్నప్పుడు ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూసిన ఒక చెక్ సినిమా గుర్తొస్తోంది

ఒక ఫాక్టరీ కార్మికులు హక్కుల సాధనకై సమ్మె చేస్తారు. ఎన్ని రోజులు పోయినా యాజమాన్యం దిగి రాదు.
కార్మికుల కుటుంబాల లో కష్టాలు వివరం గా చూపిస్తారు.
చివరాకరికి విసుగొచ్చిన కార్మిక నాయకులు ఒక రాత్రి ఫ్యాక్టరీని తగుల బెట్టిస్తారు.
కార్మికులు విజయ గర్వం తో ఇంటికెళ్ళి కుటుంబ సభ్యులకి చెప్పి పడుకుంటారు.
తెల్లవారాక ఒక కార్మిక కుటుంబం లో దృశ్యం
అలవాటుగా కార్మికుడు యూనిఫారం తొడుక్కొని స్టీల్ టోపీ పెట్టుకొని గుమ్మం దాట బోతుంటే ...
వాళ్ళ పదేళ్ళ కూతురు ఇలా అంటుంది "
Otec Kam jdeš ..?"
(నాన్న ఎక్కడికి వెళ్తున్నావ్)

జీవితం కూడా ఫాక్టరీ లాంటిదే తగుల బెట్టేస్తే ఎలా జీవిస్తాం ?


ఎవరి నష్టం, ఎవరికి లాభం ?



ఏపి భవన్ అంటే ? ఆంధ్ర ప్రదేశ్ భవన్ అని కదా...
మరి తెలంగాణా వాదులకు శ్రీ యాదిరెడ్డి భౌతిక కాయాన్ని అక్కడికి తీస్కేళ్ళాలనే ఆలోచన ఎందుకు కలిగిందో ?
ఇంకా విభజన జరగలేదు కాబట్టి అది ఉమ్మడి భవనమే అనుకుంటే..
మరి హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళ ఆస్తుల ధ్వంసం, విగ్రహాల కూలేయ్యడం లాంటి పనులెందుకు చేసినట్టో...

ఎవడో జ్వాలను రగిలించారు
వేరెవరో దానికి బలిఅవుతున్నారు

అది యాది రెడ్డి కావచ్చు,
ఇంకా తొందర పాటు చర్యలో ఆత్మాహుతి చేస్కున్న విద్యార్ధులే కావచ్చు,
వాళ్ళ ఆత్మ శాంతికి ప్రార్ధిద్దాం....

సామరస్య ధోరణి లో మాట్లాడి దెబ్బలు తిన్న జయప్రకాష్ నారాయణే కావచ్చు,
విధి నిర్వహణలో తన్నులు తిన్న చందర్రావు కావచ్చు
వాళ్ళ మనో శాంతికి ప్రార్ధిద్దాం...

ఏరోజు బందో, ఏరోజు భోజనమో తెలియని కడు పేదవారు కావచ్చు
వారి క్షుద్శాంతి కై ప్రార్ధిద్దాం...


ద్వంసమైన ఆస్తులు కావచ్చు
హింస పడిన మనసులు కావచ్చు
నష్టాన్ని తిరిగి ఎవరూ పూడ్చలేరు
ఎందుకంటే

AN OLD SAYING:
GOD ONLY CAN TAKE LIFE
'COZ HE ONLY CAN GIVE IT.

MODERN PHYSICS :
MATTER CAN NOT BE CREATED,
BUT CAN BE DESTROYED EASILY !!

21, జులై 2011, గురువారం

"మా అమ్మ భానుమతి" పార్ట్-2


అలా సగం నిద్రా, సగం పాటలతో వెలుగు వచ్చేసింది. అంటే ఎండ కాదు కానీ చెట్లు ఆకుపచ్చగానూ, పొలాలు ఎర్రమన్నుతోనూ, దూరంగా కనీ కనపడని కొండలు నీలంగా నల్లగా కనపడే అంతగా వెలుగొచ్చింది. నేను కిటికీ లోంచి తల బయట పెట్టి విసురుగా తగిలే గాలికి నా జులపాల జుట్టు ఎగురుతుంటే, చల్ల గాలికి గుక్క తిప్పుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతూ తల లోపలకి తెచ్చేసుకుంటూ.. ఆనందిస్తున్నాను.

ఊహ తెలిసాక ఎప్పుడూ కొండలని అంత దగ్గరగా చూడని నేను శేషాద్రి కనుమలను చూస్తూ విస్తూబోతుంటే సూర్యుడు వచ్చి బోలెడు వెలుగు తెప్పించి ఎండ ఎక్కించాడు. మా బస్ దాదాపు తొమ్మిదికి కొంచం అటూ ఇటూ గా తిరుపతి బస్టాండు లో ఆగింది, మా రాజేశ్వరీ టీచరు వాళ్ళ తమ్ముడు ఆర్టీసీ లోనే పని. అయన బస్ దగ్గరకివచ్చి రిసీవ్ చేస్కొని రిక్షా మాట్లాడి, తను వెనుక సైకిల్ మీద అనుసరిస్తూ ఇంటికి తీస్కేల్లారు.

ఇంటికెళ్ళగానే మా రాజేశ్వరి టీచరు మొహం కడుక్కో, స్నానం చెయ్యి డ్రిల్ టీచరు అసలు స్వరూపం బయట పెట్టింది. ఆర్టీసీ బాబాయి వాళ్ళ ఇల్లు చిన్నగా పొందిగ్గా ఉంది, విచిత్రం గా వంటింటి పక్కనే బాత్రూం కూడా ఉంది ఆనుకుని. మా ఇంట్లో బాత్రూం అవీ కొంచం దూరం లో ఉండేవి. నేను వింతగా చూస్తుంటే ఇక్కదంతే జాగా తక్కువుండేదీ ఇల్లు గిలక్కాయల మాదిరి ఉండును. స్నానాల కొట్టు కూడా అందులోనే అని కొంచం యాస లో చెప్పింది పిన్నిగారు.

నేను స్నానం చేసా. అదేదో ముక్కు కి మంటగా ఉండే, బాదం కాయ షేప్ లో, గాజులా ఉన్న సబ్బు. పేరు చదివా పియర్స్. ఆ వాసన మొదటి సారి వాళ్ళింట్లో చూసానా.. ఆ తర్వాత ఎప్పుడు పియర్స్ తో స్నానం చేసినా నాకు తిరుపతీ ,ఆ చిన్న బాత్రూం, ఇత్తడి గంగాళం చెంబూ గుర్తోచ్చేస్తాయి. ఇప్పటికీ ఒట్టు.

అయ్యాక ఆరోజంతా రెస్ట్ సాయంత్రం బయటకి వెళ్లాం. గోవింద రాజ స్వామి గుడి కెళ్ళాం. ఆ గుడి నాకెందుకో తెగ నచ్చేసింది. సాయంత్రపు సేవ అనంతరం మాకు పెట్టిన దద్ద్యోజనం కారణమయి ఉంటుంది.

కాసేపు తిరుపతి వీధుల్లో తిరిగి ఇంటికొచ్చేసాం. ఆ రాత్రి మిద్దె మీద ఆరుబయట పడుకున్నాం. అక్కడి నుంచీ చూస్తే దూరంగా కొండలూ , బస్ దారీ, నడకదారీ వెంబడి లైట్లు లీలగా కనిపించిన నామాలూ. ఏదో లోకం లో ఉన్నట్లు గా అనిపించింది. అసలు తిరుపతి ఊరంతా ఏదో లోకం లా ఉంటుంది సందడి గా ఎంత రాత్రయినా మనుషుల అలికిడి తో, పెళ్లివారిల్లులా...


మరుసటి రోజు పొద్దున్నే లేపేసారు. కొండకి వెళ్లాలని స్నానం అయ్యాక జత బట్టలు చిన్న బాగ్ లో పెట్టుకున్నాక గుర్తొచ్చింది మా అమ్మ ఇచ్చిన బిస్కట్ పాకెట్.

అడుగు దామని మళ్ళీ ఊరుకున్నా. మేము నలుగురమూ మళ్ళీ బస్టాండ్ కి వెళ్లి ఆర్టీసీ బాబాయి ముందే డ్రైవరుకి కండక్టర్కి మనోళ్ళే కొండకి ఎల్తన్నారు కాస్త బస్ లో జాగా అట్టిపెట్టేదీ.. అని చెప్పి ఉంచటం వల్ల ముందు సీట్లలో కూర్చున్నాము. బస్ బయలు దేరగానే గోవిందా గోవిందా లతో మార్మోగింది. మా రాజేశ్వరి టీచరూ, పిన్ని గార్లూ నాకు జాగ్రత చెప్పారు బస్ కొండ ఎక్కేటప్పుడు మలుపు తిప్పుళ్ళలో వాంతులవుతాయి , అలా అనిపిస్తే ముందే చెప్పు అని. అరగంట తర్వాత బస్ కొండ ఎక్కడం ప్రారంభించింది.

ఇంకో పది నిముషాలకు రోడ్ మలుపులు రావటం మొదలయ్యాయి. నా పక్క వాళ్ళిద్దరూ నా సంగతి పట్టించుకోకుండా చీర కొంగులు ముక్కు కీ మూతికీ అడ్డం పెట్టుకొని ఏదో అవస్థ పడుతున్నారు. నాకు అర్ధం కాలేదు ఏమైందో అని.

ఉత్తర క్షణం లో ముందు రాజేశ్వరి టీచరు ఆనక ఆర్టీసీ పిన్నీ బస్ కిటికీ లోంచి తలలు బయటకి పెట్టి ఓక్క్.. ఓక్క్.. అంటూ డొక్కోవటం చూసా అలాగే బస్ లో ఇంకొంతమందీ..... అదయ్యాక సీసాలో నీళ్ళతో మూతి కడుక్కొని హ్యాండ్ బాగ్ లోంచి నిమ్మకాయలు ఇంకా నిమ్మతొనలనే బిళ్ళలూ తీసి ప్రధమ చికిస్థ ప్రారంభించారు. ఇలాటి బాధ లేమీ లేని నేను తిరుమల కొండల అందాలు చూస్తూ గడిపేశాను.

అంతలో తిరుమల వచ్చింది. ముందు కళ్యాణ కట్టకి వెళ్లి అక్కడ నా ఆరునెలల పొడుగు కేశ ఖండన చేయించి. స్నానం చేసాక బట్టలేస్కోని వెళ్లి పెద్ద పెద్ద కటకటాలున్న హళ్ళలో సిమెంటు బెంచీల మీద కూర్చున్నాం. ఎవరో మా హాలు కి తాళం వేసారు.

అలా కొన్ని గంటల తర్వాత మాముందు హాలు తెరిచి వాళ్ళని పంపారు. పోద్దునేప్పుడో తిన్న ఇడ్లీలు అరిగి కడుపు ఖాళీ అయితే నాకు ఆకలని అడగటానికి మొహమాటం, కాసేపటకి రాజేశ్వరి టీచరు తన దగ్గరున్న బాగ్ తెరచి అందులోంచి అమ్ప్రో బిస్కట్ ప్యాకెట్ ఇచ్చారు తినమని. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్న పాఠం
షేరింగ్ ననుసరించి వాళ్లకు కూడా బిస్కట్ లు పంచాను, ఇంకా ఆమె బాగ్ లో నున్న పళ్ళూ తినుబండారాలు కూడా తిన్న తరువాత ఎప్పటికో మా హాలు తాళం తెరిచారు.

పొలోమని తోస్కుంటూ తొక్కుకుంటూ ఇంకో గంట కి ఆ కలియుగ దైవాన్ని దర్శించుకున్నాము. అప్పట్లో ఈ లఘు, మహాలఘువు లు లేవు తీర్ధం శటగోపం కూడా లోపలే ఇచ్చేవారు. స్వామి ని బాగా దగ్గర నుండీ చూడ అవకాశం కలిగేది.
మా అదృష్టం బాగుందీ మా ముందున్న ఎవరో పెద్దాయన గౌరవార్ధం హారతి ఇస్తే లైను మాతో గర్భగుడిలో ఆగిపోయి మేము కొద్ది నిముషాలు అలాగే ఉండి, దివ్య దర్శనం చేస్కున్నాము. బయటకి వచ్చి భోజనం చేసి, కాసేపు అటూ ఇటు తిరుగుతూ కొండపైనెక్కడో కనపడే గులాబీ రంగు భవనాన్ని జమునా బిల్డింగ్ అని చెప్పారు. జమునేవరో నాకు తెలీలా. ఆ భవనము ముందు గార్డెన్ లో కాసేపు ఉండి. చీకటి పడే వేళకు బస్టాండ్ కి వచ్చి బస్సెక్కి తిరుపతి వచ్చేసాం.

ఆ మరునాడు సాయంత్రం వాళ్ళ ఇంటి దగ్గర లో నున్న ఇంకో గుడికి తీస్కేల్లారు. పెద్ద గుడి ఆవరణ పెద్ద చెట్టు నాకు గుర్తున్నాయి. మంటపం లో ఎవరో పెద్దాయన పురాణం చెప్తున్నారు అక్కడ వెన్నెల్లో కూర్చొని చల్ల గాలి ఆస్వాదిస్తూ , చాలా మంది పురాణం వింటున్నారు. కొద్ది సేపట్లో మేము ఇంటికెళ్ళి పోయాము. బహుసా అది కోదండ రామాలయం అని నా ఊహ. ఆ మరునాడు సాయంత్రం మళ్ళీ తిరుగు ప్రయాణం. ఎందుకో చాలా దిగులుగా అనిపించింది. కారణం తెలీని దిగులు. ఆ దిగులు నాకు ఇప్పటికీ ఉండి తిరుమల వెళ్లి తిరుగు ప్రయాణం లో నేను అలా కాసేపు దిగులు గా అయిపోతా, ఆ దివ్య క్షేత్రం లో ఉన్న మహత్తు అలాంటిదో, మరింకేమో కారణం కానీ.


ఎందుకో తిరుగు ప్రయాణం గుర్తులేదు. మర్నాడు మా బందరు లో పొద్దున్న 9 గం లకి చేరాం వెంటనే ఇంటికెళ్ళి స్నానం చేసి స్కూల్ డ్రెస్ లేకుండానే పడి కి ఒక పడి నిముషాలు ఆలస్యం గా వెళ్ళాను అప్పటికి సరోజినీ టీచరు గారి ఫస్ట్ పిరియడ్ తెలుగు మొదలై పోయింది. ఆరునెలలుగా జులపాల తో ఉంది ఒక్క సారి గుండు కనిపించేసరికి మా క్లాస్ లో పదకొండు మంది అబ్బాయిలు కిల కిల నవ్వారు. మా సరోజినీ టీచరు నా వంక ఒక సారి తృప్తిగా చూసి అమ్మయ్య ఇప్పుడు హాయిగా ఉందిరా బుజ్జీ అన్నారు. మా క్లాసులో మిగతా పాతిక మందీ అమ్మాయిలు వాళ్ళలో వాళ్ళే ఏదో గుస గుస లాడుకొంటూ నవ్వుకుంటున్నారు.


నవ్వితే నవ్వారులే నాకేంటీ అని ఊరుకున్నా. మీరే చెప్పండి ఊరుకున్నంత ఉత్తమం, బోడి గుండంతా సుఖం లేదనేగా మీరూ అంటారు. అదే జరిగింది.


కొస మెరుపు : మధ్యానం తీరిక లో మా అమ్మ రాజేశ్వరీ టీచరుని అడిగింది మా వాడు ఎమన్నా ఇబ్బందీ, పేచీ పెట్టాడా అని ? ఆమె నవ్వి ఏమీ లేదు రాత్రి నిద్ర లో ఒక్క కాలు ఒక్క చెయ్యి నా మీద వేసి పడుకున్నాడు అంతే, నాకూ కదలడానికి వీలు లేకుండా అన్నారు. ఆమె కి ఎందుకనో పెళ్ళికాలేదు, అందుకే పిల్లల కాలూ, చెయ్యి గోల లేదు మరి.


20, జులై 2011, బుధవారం

మా అమ్మ భానుమతి !!




పాట ను ఆటో ప్లే లో పెట్టలేదు వినలనుకున్నవారు ప్లే బటన్ నొక్కండి


భానుమతి మా అమ్మ.
నిజం !! చిన్నప్పుడు నేను పొత్తిళ్ళ వయసులో ఉన్నప్పటి నుంచి ఎత్తుళ్ళ దాకా,
పారాడే వయసు లోంచి, మాట్లాడే వయసుదాకా మా ఇంట్లో భానుమతి అటూ ఇటూ తిరుగుతూ పని చేస్కుంటూ, దొడ్లో కాళ్ళ మీద కూర్చోపెట్టుకొని నీళ్ళు పోస్తూ "పెరిగే మా బాబు ధీరుడై ధరణీ సుఖాలా నేలగా....." అంటూనో
మాకు చదువు చెప్తూ, అన్నం వండుతూ, పొద్దున్నే స్కూల్ కి టైమవుతుంటే హడావిడిగా పూజ చేస్తూ మధ్యలో "సావిరహే తవ దీనా..." అంటూ కూని రాగాలు తీసేది
సాయంత్రం మేము చేసే పనులకు అరుస్తూ, మా వెంట పరిగెత్త లేక వగరుస్తూ,
స్కేల్ రొంపిన దోపుకొని దొరికాక వేస్తా మీకు మంచి పెసరట్లు అంటూ బెదిరిస్తూ " సన్నజాజి తీవేలోయ్ సంపంగి పూవులోయ్ ..." ఎప్పుడూ పాడుతుండేది

అంతమాత్రాన మీరంతా భానుమతంటే సినిమా లో భానుమతనుకునేరు మా అమ్మ భానుమతికి పిచ్చ ఫాను.
చాలా బాగా పాడేది. అంచేత మా ఇంట్లో మిగతా వాళ్ళ సంగతేమో కానీ నాకు మాత్రం భానుమతి పాటలంటే భలే ఇష్టం.

రోజు ఆఫీసు నుంచి వస్తూ ఆమె సీడీ వింటూ ఆమె పాటల్లో ఒక మంచి ముత్యం "మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా మేలుకోవయ్యా .. దగ్గర ఆగి పోయా. క్రమం గా నా ఎనభై కిలోల బరువు తగ్గిపోయి నేను పొట్టిగా సన్నగా పీల గా
మెడల దాకా జుట్టు తో మారిపోయా. అదేంటో నా షూస్ బాగా లూస్ అయ్యాయి నా చొక్కా ప్యాంటు నా శరీరానికి నాలిగింతల పెద్దవి అయ్యాయి.

కారణం పాట వింటూ నేను నేను ముప్పై అయిదేళ్ళ వెనక్కి వెళ్ళిపోవటమే...
అప్పుడు నాకు పదేళ్ళు చదువు ఐదో క్లాస్ లో ఉన్నా. ప్రతీ ఏడు క్రమం తప్పక తరువాతి తరగతికి ఎదిగినట్లే, పొడుగు పెరిగినట్లే, పెద్దాడినయినట్లే, నాకింకో అలవాటు కూడా ఉంది.
అదేంటంటే ప్రతీ ఏడూ క్రమం తప్పక ఏదో ఒక అనారోగ్యం తెచ్చుకోవటం, కుట్లేసే అంత గాయం ఆటల్లో తగిలించు కోవటం చేసేవాడిని. ఒక ఏడు డబల్ టైఫాయిడ్ వస్తే ,ఇంకో ఏడు తడపర కోరింత దగ్గు, ఇంకో సారి ఆటలమ్మ.
ఇంకో సారి ఇంకోటీ ఇలా నా పద్ధతి లో నేను జబ్బు పడేవాడిని.

ఒక నెల రోజులు రెస్ట్ గా ఇంటి వద్దే విద్యాభ్యాసం. అల్లాంటి టైముల్లో మా అమ్మ గంగానమ్మ కి సద్ది పోయించంటం నుంచీ మొదలుకుని తిరుపతి వెంకన్నకు నా జుట్టు ఇస్తానని మొక్కుకోవటం దాకా. ఐదో క్లాస్ మొదట్లో వచ్చిన టైఫాయిడ్ కి తిరుపతి మొక్కు మొక్కింది. ఇక అప్పటి నుంచీ నో క్రాఫ్ అలా ఆరునెలలు గడచినాయి. తిరుపతి వెళ్ళే వీలు కాలేదు. మా అమ్మా నాన్న ఇద్దరూ ఉద్యోగాల వలన ఒకే సారి సెలవ దొరకకో, ఇంకేదో కారణాల వల్లో అలా నెలల తరబడీ నా మొక్కు తీరక, జుట్టు పెరిగి హిప్పీ లా తయారయ్యా.

ఇదంతా చూసి ఒక రోజు మా అమ్మా ఫ్రెండు రాజేశ్వరిటీచరుగారు వాళ్ళ తమ్ముడు తిరుపతిలో ఉంటారు, ఆయన్ని చుట్టపు చూడటానికి వెళ్తూ నన్ను తనతో పంపమని మొక్కు చెల్లించి తీసుకు వస్తానని చెప్పారు. ఇదేదో మంచి అయిడియా లా ఉందని మా అమ్మా ఒప్పుకుంది.

ఒక మంచి రోజుకు టికెట్స్ బుక్ అయ్యాయి. బందరు-తిరుపతి బస్ కి. సాయంత్రం ఏడు గంటలకి ప్రయాణం మొదలు. చక్కటి చిక్కని ఎర్రటి రంగున్న బస్ లో మూడు రెండు (3 బై 2 ) ఆకుపచ్చని రెగ్జిన్ సీట్లున్నాయి . గంటకు నలభై కిలోమీటర్ల వేగం మించని భద్రమైన మా మంచి బస్. సుమారు నాలుగు వందల తొంబై కిలోమీటర్ల దూరం పద్నాలుగు గంటల్లో తీస్కెళ్ళే ఉదారమైన బస్. ఉదారమంటే, మరంతేగా చిన్నప్పుడు బస్ ఎక్కితే గమ్యం త్వరగా రాకూడదు అని కోరుకునే వాడిని ఎంచక్కా బస్ లోనే ఉండచ్చని.
కిటికీ లోంచి చూస్తూ వెనక్కి పరిగెత్తే లైటు స్తంభాలు, చెట్లు, ఇళ్లు, మనుషులు ఇతర వాహనాలు చూస్తూ. (నిజానికి అవేమీ పరిగెత్తవుట మనమే ముందు వెళ్తామట మా శాంతీ టీచర్ చెప్పేవాళ్ళు).

ఇంతకీ రోజు రానే వచ్చింది నేనూ మా రాజేశ్వరి టీచరు బస్ ఎక్కాము. ఎక్కే ముందు మా ఆమ్మ ఒక అమ్ప్రో బిస్కట్ పాకెట్ కొనిచ్చింది. దార్లో ఆకలేస్తే తిను అని. అది మా టీచరమ్మ బాగ్ లో పెట్టేసారు. అడగటానికి నాకు మొహమాటం. ఆమె ఇవ్వలేదు.

అలా రాత్రి ఏడు గంటలకు మొదలైన మా ప్రయాణం సుమారు రెండు గంటల పై చిలుకు తర్వాత బెజవాడ జేరింది. పావుగంట తర్వాత మెల్లగా గుంటూరు వైపు దారి తీసింది. బస్ లో నిద్ర పట్టని నేను రెప్ప వాల్చకుండా కిటికీ లోంచి చూస్తూనే ఉన్నాను. మధ్యలో ఆకలి లేక పోయినా మా టీచరు బిస్కట్ పాకెట్ ఇస్తే బాగుండు కదా అనుకున్నా. ఉహు ఎం లాభం లేదు ఇవ్వలేదు పైగా సీటు వెనక్కి తల జేరేసి కళ్ళు మూస్కొని ధ్యానం చేస్తున్న భంగిమ లో ఉండి పోయారు.

నేను ఆమె వంక కిటికిలోంచి మార్చి మార్చి చూస్తూ గడుపుతున్నాను. ఒకటి రెండు సార్లు ఆమె కళ్ళు తెరిచి నన్ను ఇంక చూడటం ఆపి పడుకో అని హెచ్చరించారు కూడా . నే వినలా ముఖం అటు తిప్పి కిటికీ వీక్షణం చేశా.

బస్ ఎన్నో ఊర్లు దాటి చిలకలూరిపేట అనే చోట ఆగింది, పదకొండింటి సమయం లో ఎర్ర బల్బుల వెలుగు లోని ఊరు. ( అప్పటికి ట్యూబులైట్లు ఇంకా బాగా వాడకం లోకి రాలా ) చిన్న చిన్న కొట్లు, మనుషుల హడావిడి తో సందడి గా ఉంది. పేరుని బట్టీ ఊర్లో చిలకలెక్కువ ఉంటాయేమో అని అనుకున్నా. ఉన్నా చీకట్లో పడుకొని ఉంటాయి మన బస్ దగ్గరికి వచ్చి కువ కువ లాడవుకదా అని సరి పెట్టుకునా.

కూరల గంపలూ, వాసన ద్వారా తెలిసిన ఉల్లిపాయల బస్తాలు బస్ లోకి ఎక్కాయి. మళ్ళీ చీకటి లోకి బస్ దూసుకు పోవటం మొదలెట్టింది. లోపల కూరగాయల వాసన, బయట పొలాల మీంచి వచ్చే గమ్మతైన వాసనల తో బస్ ఎగుడు దిగుడు రోడ్ల మీద ఎగిరెగిరి పడుతూ వెళ్తోంది.
చల్లటి గాలి మొహమ్మీద కొడుతుంటే బస్ కుదుపులకి ఊయల హాయి వచ్చి, నాకు నిద్ర ముంచుకొచ్చి , మా రాజేశ్వరి టీచరు గారి చేతి మీద తల ఆన్చి నేనూ ధ్యానం లోకి వెళ్ళిపోయా.
ధ్యానం లో నాకెన్నో కనపడ్డాయి.... కొండలూ లోయలూ, నాకు బిస్కట్ పాకెట్ ఇవ్వకుండా ధ్యానం చేస్కుంటున్న మా రాజేశ్వరి టీచరూ, ఊయలా, ఉల్లిపాయలూ, వెంకటేశ్వరుడూ, మా బడీ, మా ఇల్లూ, మా ఆమ్మ భానుమతి, ఆమె పాటా ఇలా ఒకదానికొకటి పొంతనలేని వన్నీ దొంతర దొంతరలు గా వచ్చి కనపడి వినిపించాయి.

ఎందుకో ఊయల ఊపు ఆగింది ఎవరో ఊయాలని చేత్తో పట్టుకొని ఆపేశారు కానీ మా ఆమ్మ భానుమతి పాటా మాత్రం వస్తూనే ఉంది " పెరిగే మా బాబు ధీరుడై ........
శ్రీకర కరుణాల వాల వేణుగోపాలా....." అంటూ కమ్మగా చెవుల్లో కొంగు సన్నగా నులిమి, తలంటిన తడిని తుడుస్తున్న ఆమ్మ చీర గిలి లా .... పాట.

కొద్ది క్షణాల్లో నేను ధ్యానం లోంచి బయటకి వచ్చేసా. పక్కన ఆమ్మ బదులు రాజేశ్వరి టీచరు. నేను మొహం తిప్పి కిటికీ లోంచి చూస్తే ఏదో ఊర్లో బస్ ఆగిఉంది. కొంచం పెద్ద ఊరే మనుషులు చూస్తుంటే కొంచం బడాయిగా ఉన్నారు బస్ ఆగిన చోట పెద్ద బస్ స్టాండు టీ బ్యాంకు, మళ్ళీ అదే ఎర్రబల్బు కాక పోతే గ్రాం ఫోన్
రికార్డ్ దానికో స్పీకర్ డబ్బా.. అందులోంచి మా ఆమ్మ గొంతుతో ఇంకేదో పాట ".... వయ్యా... కావేటి రంగా శ్రీ రంగా మేలుకోవయ్యా.. తెల్లవారేనుగా ...".అంటూ.

ఇదేంటి మా ఆమ్మ ఈ పాట ఎప్పుడు పాడిందీ అనుకుంటూ కుతూహలంగా విన్నా ...ఆ తెల్లారి చీకట్ల లో అంత కమ్మని గొంతు తో అంత చక్కని ఆ పాట శ్రీ రంగనాధుడిని మేలుకో మంటూ వేడుకున్న పాట నా మనసు లో లోతుగా నాటుకు పోయింది. ఇంతకీ మేము ఆగిన ఆ ఊరు నెల్లూరు.

ఇలా తిరుపతి వెళ్ళే బస్సులన్నీ అక్కడ తెల్లారి ఆగుతాయిట. ఆగిన ప్రయాణీకులకి వాళ్ళ నెల్లూరు బడాయి అంతా చూపిస్తూ గ్రామఫోన్ లో వాళ్ళ శ్రీరంగడిని నిద్ర లేపే ఆ పాట వేస్తూ నాలాటి పామర జనానికి వాళ్ళ నెల్లూరి సంస్కృతీ ప్రాభావాలు ప్రదర్శిస్తారన్నమాట.
అందుకే దాన్ని బడాయి అన్నా.( నెల్లూరు సాములూ సరదాగా తీస్కోండి. నాకు నెల్లూరంటే చాలా ఇష్టం ).

ఆ తర్వాత బస్ బయలుదేరిన దగ్గరినుంచి ఇంక నిద్ర పట్టలేదు.
సాహిత్యం రాని ఆ పాట ని నా అపస్వర కూని రాగాలతో పాడుకుంటూనే ఉన్నా మధ్య మధ్య ధ్యానం చేస్తూ....

అదన్న మాట సంగతి !! ఈరోజు విన్న ఈ పాట నా మనసు జ్ఞాపకాలను అంత లోతుగా తవ్వి బయట పెట్టిన విధానం...

మీకు బోర్ కొట్టి ఉండవచ్చు కానీ నా లిపి లేని భాష ఇంకెక్కడ రాస్కోనూ..?

12, జులై 2011, మంగళవారం

ఆకులో ఆకునై...!!


గీతా చార్యుడేమన్నాడు...?


పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్య ప్రయచ్చతి
తద్ అహం భక్తి -ఉపహ్రితం
ఆహ్నామి ప్రయతాత్మనః

ఎవరైతే నాకు ఆకైనా, పండైనా, పువ్వైనా, కనీసం నీరైనా భక్తితో, ప్రేమతో సమర్పిస్తారో
అట్టివానిని నేను అత్యంత ప్రీతితో స్వీకరిస్తాను.
చిన్నప్పుడు ఘంటసాల గారి భగవద్ గీత రోజుకో సారి విని, విని ఈ శ్లోకం దగ్గర కొంచం డౌట్ పడేవాడిని.
భక్తులెవరన్నా ఆ కృష్ణుడికి పళ్ళివచ్చు , పూలివ్వచ్చు , పోన్లే నీరు కూడా సమర్పించ్చొచ్చు ,
మరీ ఆకులిస్తారా ఏంటి? ఇస్తే ఏమి ఆకులిస్తారు ?

పళ్ళిస్తే హాయిగా వనంలో గోవులు కాసుకుంటూ తినొచ్చు. మరీ ఎక్కువయితే రసం తీసి తాగొచ్చు.
పూలిస్తే పక్కింట్లో రాధ కివ్వొచ్చు, లేదా దండ చేసి మెళ్ళో వేసుకోవచ్చు, అప్పుడు చెంగల్వ పూదండ పద్యం లో లాగా అందం గా కనపడొచ్చు.

నీరిస్తే దాహమేస్తే తాగొచ్చు, మొహం కడుక్కోవచ్చు . లేదా బాగా ఎక్కువిస్తే స్నానం కూడా చెయ్యొచ్చు.

మరీ అకులేంటి ?
భక్తులు శ్రీ కృష్ణునికి మరీ ఆకులిస్తారా ఏంటి?
ఇస్తే ఏమి ఆకులిస్తారు ?
ఇలా ఆలోచిస్తే ఎన్నో ఆకులూ స్పురిస్తాయి...

తమలపాకులిస్తే కిళ్ళీలు చుట్టి వేస్కోవచ్చు. రుక్మిణికిస్తే రాత్రి బోనాలయాక అంతఃపురం గవాక్షం లో వెన్నెల్లో ఉన్న తూగుటుయ్యాల పై మాగన్నుగా నిద్దరోస్తుంటే, చిలకలు చుట్టి వేళ్ళకి తొడుక్కొని ఈ ఒక్కటీ, ఈ ఒక్కటీ అంటూ బుజ్జగిస్తూ నమిలిస్తుంది, భేష్ బానే ఉంది ఈ ఐడియా !!
అబ్బే శ్రీ కృష్ణుడు కిళ్ళీలు, చిలకలు అలవాటు లేని బుద్ధిమంతుడు అంటారా.
సుబ్బరం గా
ఆదివారం సాయంత్రమో శనగపిండి జారుగా కలిపి వామేయించి సత్యభామ తో బజ్జీలు వేయించు కుంటాడు.
ఇంటి వెనక పొగడ చెట్టు కింద కూర్చొని గోపబాలురు ఆడే ఆటలు చూస్తూ ఇంచక్కా తినేయచ్చు.
ఇంకా ఏంటి ఉపయోగాలంటారా .. ?
పాలూ మీగడ వెన్న ఎక్కువయ్యి బొజ్జ నోస్తే,ఆముదం రాసి
కుంపటి సెగ మీద వేడిచేసిన తమల పాకు తో కాపడం పెడితే దెబ్బకి నొప్పి హరీ !!
అంచేత తమలపాకు ఇస్తే ఉపయోగమే.

ఇంకా ఎ అరటి తోటలున్న ఆసామో రెండు కట్టల అరిటాకులు సమర్పించుకుంటే ..
రోజూ అందులోనే కృష్ణ పరమాత్మ భోజనం చెయ్యొచ్చు.
పెద్దాకులు చిరిగితే వెండి ఫలహారప్పళ్ళెం కొలతకు కత్తిరించి అదివేసి వేడి వేడి నేతి పెసరట్టేస్కోని అల్లం మిరపకయముక్కలూ, ఆ వేడికి అరిటాకు రసంతో కలిస్తే ఆ రుచే వేరని
అమ్మ యశోదమ్మ మరీ రెండు అట్లెక్కువ తినిపిస్తుంది.
ఇంకా చిన్న అరిటాకులు మిగిలిపోతే మినప గారెలు తట్టుకోవడానికి పనికి వస్తాయి.
కాబట్టి అరిటాకులిచ్చినా సరే ఉపయోగ పడతాయి.

ఇంకా తోటకూరాకు ఇస్తే వడియాలూ, కందిపప్పు తో పొడికూర చేస్కోవచ్చు.
లేదా ఒక చిన్న మామిడికాయ వేసి పప్పు చేస్కో వచ్చు.
అందులోకి వేయించిన ఎండు మిరపకాయలు మర్చిపోకుండా ఉంటె భేష్ భేష్.

తోటకూరనగానే నాకో బాల్య జ్ఞాపకం (
ఏంటీ దొంగతనమా అని మీకు సందేహం ఒద్దు)
నా చిన్నప్పుడు సుమారు ఏడు ఎనిమిదేళ్ళ వయసులో నేను ఆకుకూరలు తినక పోతే
మా నాన్న మా బందరు బస్టాండు పక్కనున్న గ్రవుండు లో వచ్చిన న్యూ గ్రాండ్ సర్కస్ కి తీస్కెళ్ళి చూపించి,
ఆ మర్నాటి నుంచి భోజనాల, సర్కస్ ఆ అబ్బాయిలు అలా ఎలా ఫీట్లు చేసారో తెలుసా చిన్నప్పుడు బోలెడు (మేటలు మేటలు) తోటకూర తింటారుట,అందుకే వాళ్ళు అలా బలంగా ఉంటారు,
అలా ఎగిరి దూకగలరు అనే వాళ్ళు.
సర్కస్ అబ్బాయిలంటే విపరీతమైన మోజులో ఉండే నేను మారు మాట్లాడకుండా కంచంలో తోటకూర కూర మాయం చేసి మళ్ళీ వేయమన్నట్లు మా అమ్మ వంక చూసేవాడిని. ఎప్పుడు తోటకూరను నేను స్వీకరించనూ అని మారాం చేసినా మా అమ్మేమి మాట్లాడేది కాదు, అందుకు గంధర్వులు ఉన్నార్లే అన్న ధీమా గా మా నాన్న వంక చూస్తూ.. అప్పుడు మా నాన్న సేరియస్సుగా మొహం పెట్టి, ఇంకేమీ సబ్జెక్ట్ లేనట్టు సర్కస్ అబ్బాయిల ఉదంతం మొదలెట్టేవారు.
అంతే అత్యంత అమాయకం గా ||తోకూ|| తినటం ద్వారా మాయం చేసేవాడిని.
అలా ఇప్పటికీ మా ఇంట్లో పెద్దాళ్ళకి నేనంటే అదే అలుసు భోజనాల దగ్గర సర్కస్ అబ్బాయంటూ హాస్యమాడతారు.నవ్విపోదురు గాక నాకేమీ ఇప్పటికీ నా బలం సర్కస్ అబ్బాయిలకేమీ తీసి పోదు.
నిజం తోటకూరమీదోట్టు.

చుక్కకూరాకు ఇస్తే పెసరపప్పు తో మేళ విస్తే అద్భుతమైన రుచి, మళ్ళీ పచ్చిమిరపకాయ నంచుకోవటం కృష్ణుడికి గుర్తుచేయ్యాలి.
చింతాకు సరే సరి పప్పు విసుగనిపిస్తే రొయ్యలతోనో, వేట మాంసం తోనో ( శాఖాహారులు క్షమించాలి కృష్ణుడు యాదవుడు, ఆయనకు తినే పర్మిషన్ ఉంది)
గోంగూర కూడా అదే కాంబినేషను కానీ పచ్చడికే నా ఓటు,
ఎంతైనా ఆంధ్రమాత కదా, మరి ఉత్తరాదివాడైన కృష్ణుడేమి చేయించు కుంటాడో ఆయనిష్టం.

నాలాంటి తింగరోడు ఎవరైనా కాకరాకు సమర్పిస్తే స్వామీ ..?
ఏమీ పర్వాలేదు అష్ట నాయికలనూ కూర్చోబెట్టి , వాళ్ళ పాలేరు పెళ్ళాం తో బోలెడు గోరింటాకు రుబ్బించి
వాళ్ళ అరిచేతుల్లో ఆ కాకరాకు వేసి అందం గా గోరింటాకు పెట్టేయగల నేర్పరి.

ఏ పల్లెటూర్లో భక్తుడే ఊరికే దొరికాయని తామరాకులు ఇస్తే
ఏమి చేస్కుంటాడు దానిమీద ప్రణయ లేఖలు రాసి సఖుల కిస్తాడా..?
లేదా బాగా ఎండ వేడి గా ఉన్నప్పుడు
శయనాగారం లో తల్పం మీద పరుచుకొని పడుకుంటారా..?

అయన సంగతేమో కానీ తామరాకులనగానే మళ్ళీ నా ఫ్లాష్ బ్యాక్
నాకు గుర్తు కొచ్చింది. అప్పుడప్పుడూ సాయంత్రాలు బజారు నుంచి వస్తూ
ఎండు తామరాకు లో వేడి వేడి మిరపకాయ బజ్జీలు
మా నాన్నఇంట్లోకి తెచ్చి నప్పుడు , ఆ పొట్లం విప్పినప్పుడు వచ్చే ఆ సువాసన నాకింకా గుర్తు
బజ్జీల వేడికి ఆ ఎండు తామరాకులు కమిలి చక్కటి పరిమళం వచ్చేది.
అందరూ బజ్జీలు తింటుంటే నేను ఆ వాసన ఆఘ్రాణిస్తూ ..ఉండిపోవడం !! నాకింకా గుర్తు.

ఇంకా ఏమేమి ఆకులివ్వొచ్చు
ఆలోచించండి ...
ఫ్లాష్ లా గుర్తొచ్చింది
పోయిన్నెలలో తీరిక దొరికి ఒక పది రోజులు మంగళూరు
చుట్టుపక్క ప్రదేశాలు చూద్దామని నేనూ మా ఆవిడా వెళ్లాం.
మంగళూరులో దిగ గానే వసతి ఎక్కడ బాగుంటుందని మా ఆవిడా ,
తిండి ఎక్కడ బాగుంటుందని నేనూ వాకబు జేస్తే,
కేయస్ రావ్ రోడ్ లోని జనత డీలక్స్ హోటల్ మంచి చోటని చెప్పారు
నిజం గానే చాలా శుభ్రంగా దర్పంగా ఉంది
కొంచం రేట్లెక్కువయినా బాగుంది.
మొదటి రెండు రోజులు అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేసాం ఇడ్లిసాంబారు,మషాలాదోశ , రవ్వరోశ , పూరీలు అన్నీ బాగున్నాయి.
మూడో రోజు ఇవన్నీ మనింట్లో కూడా తినేవే కదా, మంగళూరు స్పెషలేంటో అని స్టివార్డ్ ని అడిగా
వెంటనే పత్రోడ్ అన్నాడు. అంటే హేమిటీ దేంతో చేస్తారు అని అడిగా, సగం ఇంగ్లిష్ లో
మేడ్ లీవ్స్ టిపిన్ అన్నాడు. ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేసి ఉన్న నేను ధ్రిల్లయి వెంటనే ఆ పత్రోడ్ గారిని ప్రవేశ పెట్టు అన్నాను. ఆయన తెచ్చాడు. తొక్కతీయ కుండా కుక్కరు లో ఉడక పెట్టిన
పచ్చి అరటికాయ షేపూ, రంగూ లో ఉన్న ఒకటి ప్లేట్ లో ఉంది.
పైగా కాంటినెంటల్ డిష్ లా పక్కన నైఫు ఫోర్క్ స్పూనూ
నేను కొంచం జంకి మా ఆవిడ వంక సావకాశంగా చూసా ట్రై చెయ్యి అన్నట్లు,
ఇలాంటి వాటికి చాలా దూరం లో ఉండే ఆవిడ ససేమీరా అంది,
ఆర్డరిచ్చిన నేరానికి నేనే ఆ ప్లేట్ ముందుకి లాక్కొని
నైఫ్ తో చాప్ చేసి ఫోర్క్ గుచ్చి చిన్న ముక్క నోట్లో పెట్టుకున్నా
ఏదో తెలియని భావాలు
ఎక్కడో పరిచయమున్న జ్ఞాపకాలు
ఆ వెలిగింది... చామాకులు పిండి రాసి చుట్టి ఆవిరి మీద ఉడికించి తెచ్చాడు.

మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది చామాకు బుట్టలు అని
చామాకులు మీద శనగ పిండి ఉప్పు కారం జీలకర్రపొడి మిశ్రమం రాసి అవి చుట్టి
ఆవిరి మీద ఉడికించి ఆనక బయటకి తీసి చక్రాలు అడ్డంగా కోసి నూనెలో వేయించేది.
భలే బాగుండేవి. కాకపోతే చిన్న చిట్కా పాటించక పోతే గొంతులో దురద వచ్చి వికారం కలుగుతుంది.
అదేంటంటే శనగ పిండి మిశ్రమం లో చితపండు కలపితే దురద రాదు.
వీడి మొహం మండా ఇది టిఫినా అనుకోని మళ్ళీ మా అవిడ పరిహాసానికి గురి అవ్వాల్సి వస్తుందని
చాలా నేర్పుగా అరగంట లో తినేసా.

ఇంతకీ చెప్పొచ్చేదేమంటే ఎవరైనా భక్తులు భక్తిగా చామాకులు కృష్ణునికి
సమర్పిస్తే వాటిని ఆయనేం చేస్కున్తాడో.
ఆయన పదారువేలమంది భార్యలకీ, ఇద్దరమ్మలకీ చామాకు బుట్టలు కూర చెయ్యటం వచ్చో రాదో ?
వస్తే గొంతులో దురద రాకుండా చెయ్యటం చిట్కా తెలుసో లేదో ?

ఏదేమైనా ఏమాకులిచ్చిన ఏదో ఒక ఉపయోగం.
ఎదీలేక పోతే ఎప్పుడన్నా చేతులు కాలాక పట్టుకోవడానికైన పనికొస్తాయి.
అయినా ఆ దేవ దేవుడి చేతులెందుకు కాల్తాయి..?

కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం శ్లోకం.... లో ఏమిచ్చినా ఆ భగవానునికి దాని ఉపయోగించటం పెద్ద సమస్య కాదని తెలుసుకోవటానికి నాకు ఇన్నేళ్ళు పట్టింది.
కాకపోతే భక్తితో ఆర్తితో ఇవ్వాలి !!