13, జనవరి 2012, శుక్రవారం

ఆదివారం, అమావాశ్య కాదు కాదు పౌర్ణమి...





ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం 6 :30 గంటలు సాక్షి, ఈనాడు పోటా పోటీ వార్తలు చదివేసాక, ఎదురింటి ముందు దీనంగా పడున్న హిందూ కూడా చూసేసి, సమయం ఏడున్నర అవుతుండగా సెల్ మోగింది కళాసాగర్ గారి ఫోన్ మన మీటింగ్ కి ఎంత మంది రావచ్చు (?) భలే ప్రశ్న. నేను అనుకున్నది పది మంది వస్తే మీటింగ్ ధన్యమే. సంఖ్యా పరం గా చెప్పలేను కానీ మీ వంతు గుర్తు చెయ్యాల్సిన వాళ్ళని చూస్కోండి నా కోటా నేచూస్కుంటా అని చెప్పా. ఒక గంట సేపు నా ఆఫీసు పని మెయిల్స్ చూస్కొని, మొదటి పెళ్ళిచూపులకు కూచో బోయే అమ్మాయిలా తెగ టెన్షన్ పడిపోయా.
తొమ్మిది కల్లా స్నానం, పూజ, టిఫిన్ అయిపోయి నేను ఆఫీసు దగ్గర కొచ్చి సెక్యూరిటీ గార్డ్ ని అడిగా ఎవరన్నా వచ్చారా అని. ఉహు అన్నాడు వెంకట్రావ్.

సరే మూడో ఫ్లోర్ తాళం తీసి మీటింగ్ హాల్స్ లో ఒకటి రెడీ గా ఉంచు అని చెప్పా. నిజానికి ముందు రోజే చెప్పా. అందుకని తయారు గా ఉంది.

గేటు దగ్గరే నుంచున్నా సుమారు పావుగంట తర్వాత ఒకతను వచ్చారు మాది వెస్ట్ గోదావరి డిస్టిక్ , ఇక్కడ బ్లోగే వాళ్ళ మీటింగ్ ఉందటగా నిన్న బుక్ ఎగ్జిబిషన్ లో చెప్పారు అన్నారు. అవును నిజమే కానీ మన ఇద్దరమే ఉన్నాము. మీకు ఇష్టమేనా నాతో భేటీ కి అన్నట్టుగా చూసా. అంతే అయన అక్కడే యూని కోడ్, తెలుగు లో ఫాంట్లు, సెంట్రల్ గవర్నమెంట్ వారి సీడి, అంటూ నాకు తెలీని విషయాలు చాలా మాట్లాడారు. ఇంతలో ఒక పెద్దాయన వచ్చారు దుర్గ ప్రసాద్ గారు పేరు (బాబు కార్టూన్స్) మంచి ఆనంద మేసింది. కొంతమంది వచ్హాక పైకి వెళ్లి కూర్చుందాం అని చెప్పి అక్కడే కబుర్లలో పడ్డాం. ఇంతలో అరవై నాలుగు కళల కళాసాగర్. సృజన ప్రియ పత్రిక తో టచ్ ఉన్న తమిరి పుల్లారావ్ గారూ, ముక్తలేఖ బ్లాగ్ ఓనరు సునీత గారూ ఆటో గిగారు . ఒక ఏడెనిమిది మంది ఉన్నాం కదాని పైకి వెళ్లి నా సీట్ దగ్గరే కూర్చున్నాం. కాసేపు పిచ్చా పాటి మాట్లాడుతుంద గానే రెహ్మాన్ వాళ్ళ అసిస్టెంట్ తో వచ్హాడు. తనని అడిగా ఎల్సిడీ ఇక్కడే ఏర్పాటు చేస్కుందాం ఎక్కువ మంది లేరుకదా అని. ప్రాజెక్ట్ చెయ్యటానికి స్క్రీన్ ఎలా అన్నాడు. మా చాంబర్ లో గోడ మీద బిల్ బోర్డ్ కి కంప్యూటర్ లో వాడే తెల్లకాగితాలు పిన్నుల తో గుచ్చి మూడు బై నాలుగు స్క్రీన్ రెడీ చేసాం. ఇంతలో అక్షర మోహనం బ్లాగ్ రాంప్రసాద్ గారు, ఏవియం గుప్తా పేరుగల కార్టూనిస్ట్ వచ్చారు. ఇంకో నిముషానికి పీవీ సుబ్రహ్మణ్యం గారనే పెద్దాయన ( ఇంకా బ్లాగ్ లేదు త్వరలో మొదలు పెడతారు) రిటైర్డ్ హెడ్ మాష్టారు చాలా ఉత్సాహం గా వచ్చారు. ఆయనతో ఒక యువ కిశోరం భరత్ అని (వన్ టిడ్ బిట్ ఆంగ్ల బ్లాగ్ ) టెక్ కుర్రాడు ఎంటర్ కొట్టాడు. ఆశ్చర్యంగా బాగా పరిచయమున్న మొహం కొంచం పెరిగిన గడ్డం తో ఒకాయన పేరు సరసి, అవును " మనమీదేనర్రోయి" అని చిన్నగా చురకలేసే పెద్ద కార్టూనిస్ట్ హైదరాబాద్ నుంచీ వచ్చారు. మన మీటింగ్ టపా విరిగి బ్లాగులో పడ్డదే అనుకున్నా. ఆయనతో బీఎస్సఎన్నల్ 3G లో పని చేసే వాళ్ళబ్బాయి కూడా వచ్చారు. ఇంతలో నవ్వులాట శ్రీకాంత్ గారు నవ్వకుండానే కామ్ గా ఎంటరై పోయారు.


ఇంకో ఔత్సాహికులు ప్రకాశ రావు గారు, మందుల కంపనీ మానేజర్ శివ కుమార్, బ్లాగులా గురించి తెలుగు వికీ గురించీ తెలుసు కోవటానికి వచ్చారు. అంతా సర్దుకుని కూర్చున్ తుం డంగా ఏలూరు రామలింగ కవిలా బులుసు సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఎవ్వరి పేర్లు ఎవరికీ ముందే తెలీవు కాబట్టి స్వ పరిచయాలు, వాళ్ళ వాళ్ళ బ్లాగోగులు చెప్పుకున్నాం.ఆ పనిలో ఉండగానే రెహ్మాన్ ప్రోజేక్తర్ సెట్ చేసుకున్నాడు. మేమంతా రెహ్మాన్ షైక్ చెప్పే తెలుగు ఫాంట్లు, తెవికి , తెలుగు కీబోర్డ్ గురించి వింటుండగానే కౌటిల్య వచ్చారు. వనజ వనమాలీ గారు (తెలుగు లో విజయవాడ నుంచీ పెద్ద బ్లాగర్ అనొచ్చా ? అనేస్తాలే ) పద్మావతి శర్మ గారు, స్టేట్ బ్యాంకు లో పని చేసే కె పుల్లారావు గారు, ఇంకో బీ ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగి రామచంద్ర రావు గారు వచ్చారు.
రెహ్మాన్, తను మరియు (తెలుగు) సుజాత గార్లు బ్లాగులు ప్రారంభించటం నిర్వహించటం మీద వ్రాసిన పుస్తకం పరిచయం చేసాడు. తెలుగు కీ బోర్డ్ డెమో ఇచ్చాడు.

ఈ టపా మొత్తం రెహ్మాన్ ని ఏక వచనం లో ప్రస్తావించా ఎందుకో తమ్ముడిలా అనిపించాడు అందుకే చనువు.


మొత్తం మీద మూడు గంటలు సమయం తెలీకుండా గడిచి పోయాయి. మొదటి సారి చూడటం అప్పుడే పేర్లు తెలుసుకోవటం వల్ల ఎవరి నైనా ప్రస్తావిన్చకుంటే నన్ను క్షమించండి.
మధ్యాన్నం రెండు గంటలు సమయానికి విజయవాడలో మొదటి తెలుగు బ్లాగర్ల సమావేశం ముగించి కిందకు వచ్చేసాం.
ఇంకా చాలా మంది హాజరవుతారని అనుకున్నా. పెద్దలు . అనుభవజ్ఞులు రాశి, వాసి రెండుకల బ్లోగుల్లున్నవారు విజయవాడ లో ఎంతో మంది ఉన్నారు వారందరితో రెండో సమావేశం త్వరలో జరుపుకోవాలని నా కోరిక.
నాకు సరియిన సమయం లేక పోవటం, అనుభవ రాహిత్యం, ఇంకా సమాచార లోపం వల్ల ఈ సారి ఇరవై మంది తో మాత్రమే జరుపుకున్నా నీల్ అర్మ్ స్ట్రాంగ్ .. ఈ చిన్న అడుగు మానవాళి మనుగడకు పెద్ద ముందడు గై నట్లు తెలుగు బ్లాగులు వర్ధిల్లి విరాజిల్లాలని కోరుకుంటూ....

క్షమాపణలు : పొరుగూరి నుంచి వచ్చిన పెద్దలు పీవీ సుబ్రహ్మణ్యం గారిని, బులుసు వారిని, ఇంకా మిగతా పెద్దలను భోజనానికి ఆహ్వానించలేని నా బుద్ది మాంద్యానికి మన్నిస్తారని ఆశిస్తున్నాను.

ఆరోజు మూడు గంటల నుంచీ రాత్రి ఏడు దాకా నాకు ఆఫీసు పని ఉండటం వల్ల అందులో పడి నేను కూడా భోజనం చెయ్యలేదు, పెద్దలను గౌరవించనందుకు దేముడు అలా శాపం పెట్టాడు.

12 కామెంట్‌లు:

  1. ఆత్రేయ గారూ ఇది విజయవాడలో జరిగిన మొట్టమొదటి బ్లాగర్ల సమావేశమా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి... ఆత్రేయ గారు.. మంచి ప్రయత్నం చేసారు..

      తొలగించండి
  2. ఆత్రేయ గారు..
    మంచి ప్రయత్నం చేశారు..విజయవంతంగా.
    అభినందనలు.
    ఎప్పుడైనా మొదటి సమావేశాలు ఇలాగే ఉంటాయి లేండి.
    నేను ఈ బ్లాగ్లోకానికి కొత్త.
    తదుపరి సమావేశానికి తప్పకుండా హాజరవుతాను.
    అప్పుడు అన్నపానాదులు ఎరేంజ్ చేద్దాం.
    నా 'చెయ్యి' కూడా వేస్తాను.

    రిప్లయితొలగించండి
  3. జ్యోతిర్మయి గారు బహుశ ఇదే మొదటిది అనుకుంటా.
    రమణ గారూ ధన్యవాదములు . అన్నం సరే, పానమేంటి ? మీ వల్ల ఔత్సాహికులు పెరిగే అవకాశం ఉంది.
    "చెయ్యి" అంటున్నారు ... మీరు బంగారమ్మ దళమా?
    తప్పక ఉగాది కి కలుద్దాం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆత్రేయ గారు.. ఎంత సునిశితం గా..సున్నితంగా..హాస్యం మేళవించి వ్రాయడమనే మీ..శైలి కి అభినందన మందారమాల.ఈ విషయం మీరు వ్రాయాలనే..నేను ఆలశ్యం చేసాను.


      విజయవాడలో..చాలా మంది బ్లాగేర్స్ ఉన్నారు. కానీ అందర్నీ కలవలేకపోవడం కొంచెం నిరాశ కల్గించినా..వచ్చిన వారితో..కొద్దిసమయం అయినా ఆత్మీయత కలబోసుకోవడం..ఆనంద కరం.అమ్మో!ఏంటండి..నన్ను పెద్ద బ్లాగర్ అనేసారు.. నేను అసలు కొందరి దృష్టిలో..లేనే లేను. నిన్న గాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా..పెద్ద బ్లాగర్ లేనా! హేమాహేమిలున్న బ్లాగర్ లు ఉన్నారు.అందులో మీరు ఒకరు.

      తొలగించండి
  4. వనజ గారు మనం మనం పొగుడుకున్నది చాలు. ఇంకా చదువరులకు అవకాశం ఇద్దాం.

    రిప్లయితొలగించండి
  5. ఇంతమంది బ్లాగర్స్ ని ఒకేచోట కలసి చాలా ఆనందించాను. ఇంత విజయవంతంగా ఆర్గనైజ్ చేసినందుకు మీకు, శ్రీ రహ్మాన్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.

    సమావేశ వివరాలు మీ శైలి లో బాగా వ్రాసారు. ఇలాంటి సమావేశాలు మీ ఆధ్వర్యం లో, విజయవాడ లో మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  6. ఈ సారి నేను కూడా వస్తాను తప్పకుండా!

    రిప్లయితొలగించండి
  7. ఆత్రేయ గారు అండ్ విజయవాడ బ్లాగర్స్ అన్దరికీ !

    మొదట మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు !

    మంచి ప్రయత్నం! మీటింగు పౌర్ణిమలో వెల్లివిరిసిన ధవళ కాంతుల విషయాలు చాలా బావున్నాయి !వాటి తో బాటు వచ్చిన బ్లాగరుల సంక్షిప్త పరిచయం కూడా బాగుంది.



    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  8. బులుసు వారూ నిర్వహణ నేచేస్తా గానీ అధ్యక్షలు మీరే.
    రసజ్ఞ గారూ మీ మెయిల్ ఐడి పంపండి ఇక్కడికి ahmisaran@gmail.com
    జిలేబి,జిగి, బిగి, బిజిలి, గులాబీ, గ్లాసులూ. చిప్సులూ. చీర్లూ..!!

    రిప్లయితొలగించండి
  9. అజ్ఞాత13 జన, 2012 11:42:00 AM

    నేను కంప్యూటర్స్ సంబందించిన బ్లాగ్స్ ఎక్కువుగా చదివేవాడిని. అమెరికా లో ఈ సాఫ్ట్వేర్ బ్లాగ్స్ రాసేవాళ్ళు నెలకొకసారి కలిసి వాళ్ళ అభిప్రాయాలని పంచుకొనేవారు.
    సరిగా అలాగే విజయవాడ లో ఆత్రేయ గారి సారధ్యం లో జరిగింది. అక్కడ అందర్ని కలవటం వారితో టెక్నాలజీ గురించి ముచ్చటించటం ఆనందం కలిగించింది.
    తరుచు కలుస్తూ మన భావాల్ని పంచుకుందాం.. ఎంతోమంది తమ అభిప్రాయాలూ పంచుకునే మాంద్యం ఈ బ్లాగ్లు. రాబోయ్యే రోజుల్లో ఇంకా పేపర్ లు, ప్రసార మాధ్యములకంటే ఈ బ్లాగ్లు వల్లే గొప్ప విప్లవాలు వస్తాయంటే ఆశ్చర్యం లేదు.

    రిప్లయితొలగించండి